Telugu Global
Telangana

ఇక నుంచి ర్యాపిడో క్యాబ్‌.. డ్రైవ‌ర్ల‌కు బంపర్ ఆఫర్

క్యాబ్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన ర్యాపిడో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అదే జీరో కమీషన్. అంటే క్యాబ్ నడిపే డ్రైవర్‌ నుంచి ర్యాపిడో సంస్థ రూపాయి కమీషన్ కూడా తీసుకోదు.

ఇక నుంచి ర్యాపిడో క్యాబ్‌.. డ్రైవ‌ర్ల‌కు బంపర్ ఆఫర్
X

క్యాబ్ సర్వీసుల్లోకి వచ్చేసింది ర్యాపిడో సంస్థ. ఇప్పటికే ప్రయాణికులకు బైక్, ఆటో సేవలందిస్తున్న ర్యాపిడో.. ఇక నుంచి క్యాబ్‌ సేవలను కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాపిడో క్యాబ్ సేవలు ప్రారంభమయ్యాయి.

దాదాపు లక్షా 20వేల క్యాబ్‌లతో ఈ సేవలను ప్రారంభించింది. 2024 సెప్టెంబరుకు వీటిని 35 నగరాలకు విస్తరిస్తామని ర్యాపిటో ప్రకటించింది. ఎక్కువమంది జనానికి సేవలు అందించి.. అతి తక్కువ సమయంలో మార్కెట్‌ను విస్తరించడమే టార్గెట్‌గా పనిచేస్తామంది. క్యాబ్‌ సర్వీసుల్లో ఉబర్‌, ఓలా సంస్థలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. సో.. ఈ రెండు సంస్థలతో పోటీ పడబోతోంది ర్యాపిడో.

రైడర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్

క్యాబ్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన ర్యాపిడో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అదే జీరో కమీషన్. అంటే క్యాబ్ నడిపే డ్రైవర్‌ నుంచి ర్యాపిడో సంస్థ రూపాయి కమీషన్ కూడా తీసుకోదు. డ్రైవర్‌కు ఒక రైడ్‌లో 300 రూపాయలు చూపిస్తే.. ఆ మొత్తం డబ్బులు డ్రైవర్‌కే వెళ్తాయి. ప్రస్తుతం కమీషన్ రూపంలో 30 నుంచి 40 శాతం వరకు డబ్బులు సేవా సంస్థలే తీసుకుంటున్నాయి. దీనిపై రైడర్లలో తీవ్ర అసహనం ఉంది.

ర్యాపిడో కూడా బైక్, ఆటో సేవల్లో కమీషన్ తీసుకుంటోంది. కానీ, కొత్తగా క్యాబ్‌ మార్కెట్‌లోకి రావడంతో.. అత్యధిక మంది డ్రైవర్లను ఆకర్షించడమే లక్ష్యంగా జీరో కమీషన్‌ పాలసీని తీసుకొచ్చింది. గతంలో ఉబర్‌ కూడా ఇలాంటి జీరో కమీషన్‌ మోడల్‌తోనే ఎంట్రీ ఇచ్చి మెరుగైన ఫలితాలు సాధించింది. ఆ తర్వాత మెల్లిగా కమీషన్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ర్యాపిడో కూడా ఉబర్‌ స్ట్రాటజీనే ఫాలో అవుతోంది.

First Published:  6 Dec 2023 5:28 AM GMT
Next Story