Telugu Global
Telangana

తెంలగాణకు రాహుల్, ప్రియాంక.. 3రోజులపాటు సభలు, సమావేశాలు

ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు రాహుల్, ప్రియాంక. అక్కడినుంచి హెలికాప్టర్ లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటకు వెళ్తారు.

తెంలగాణకు రాహుల్, ప్రియాంక.. 3రోజులపాటు సభలు, సమావేశాలు
X

తెలంగాణలో కాంగ్రెస్ హడావిడి మొదలు కాబోతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వారు తెలంగాణలోనే మకాం వేస్తారు. సభలు, సమావేశాలు, రోడ్ షో లతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తారు. ములుగు నియోజకవర్గంతో ఈ సందడి మొదలవుతుంది. ములుగు, జయశంకర్‌-భూపాలపల్లి, కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లాల్లో మూడు రోజులపాటు కొనసాగుతుంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలపై రాహుల్, ప్రియాంక.. ప్రజలకు వివరిస్తారు.

ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు రాహుల్, ప్రియాంక. అక్కడినుంచి హెలికాప్టర్ లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటకు వెళ్తారు. రామప్ప ఆలయంలో కాంగ్రెస్ గ్యారెంటీ హామీ కార్డులకు పూజలు చేస్తారు. సాయంత్రం 5 గంటలకు బస్సుయాత్ర మొదలు పెడతారు. స్థానిక మహిళలతో ముఖాముఖి, బహిరంగ సభ ఉంటాయి. భూపాలపల్లిలో నిరుద్యోగుల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

గురువారం ఉదయం భూపాలపల్లి నుంచి మంథని వెళ్తారు ప్రియాంక, రాహుల్. రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబుతో కలసి పాదయాత్రలో పాల్గొంటారు. అదేరోజు పెద్దపల్లిలో బహిరంగ సభ ఉంది. గురువారం రాత్రి 7గంటలకు కరీంనగర్‌ లో పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక శుక్రవారం బోధన్‌ నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ సందర్శన ఉంటుంది. ఆర్మూర్‌ లో పసుపు రైతులతో ముఖాముఖి బహిరంగ సభ ఉంటాయి. తర్వాత నిజామాబాద్‌ లో పాదయాత్ర ఉంటుంది. నిజామాబాద్ పాదయాత్రతో మూడు రోజుల రాహుల్, ప్రియాంక పర్యటన ముగుస్తుంది.

First Published:  18 Oct 2023 1:31 AM GMT
Next Story