Telugu Global
Telangana

హోరెత్తనున్న ప్రచారం.. ఇవాళ రాష్ట్రానికి రాహుల్, అమిత్ షా

ఇవాళ రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ.. మూడు చోట్ల పర్యటిస్తారు. ఉద‌యం 11.30 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

హోరెత్తనున్న ప్రచారం.. ఇవాళ రాష్ట్రానికి రాహుల్, అమిత్ షా
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం మరింత హోరెత్తుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్‌రావు.. ఆశీర్వాద సభలు, రోడ్ షోలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యనేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ రెండు పార్టీలకు సంబంధించిన జాతీయ నేతలు ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. పలు బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు.

ఇవాళ రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ.. మూడు చోట్ల పర్యటిస్తారు. ఉద‌యం 11.30 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 12 గంటల 5 నిమిషాలకు మణుగూరు వెళ్తారు. తర్వాత పినపాక బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేట చేరుకుంటారు. తర్వాత వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. తర్వాత కార్నర్ సమావేశంలో పాల్గొంటారు. తిరిగి హైదరాబాద్‌ నుంచి జైపూర్‌కు వెళ్తారు.

ఇక బీజేపీ కీలక నేత అమిత్ షా ఇవాళ రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంటారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని బీజేపీ మీడియా సెంటర్‌లో మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. తర్వాత గద్వాల, నల్గొండ బహిరంగ సభల్లో పాల్గొంటారు. రేపు సాయంత్రం వరంగల్‌లో నిర్వహించే సకల జనుల విజయసంకల్ప సభకు హాజరవుతారు. తర్వాత హైదరాబాద్‌లో రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ నేతలతో సమావేశమై ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చిస్తారు. శనివారం రాత్రి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ఈనెల 20న మరోసారి రాష్ట్రానికి వచ్చి 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు.

First Published:  17 Nov 2023 4:58 AM GMT
Next Story