Telugu Global
Telangana

ముగిసిన అంత్యక్రియలు.. హత్యేనంటున్న ప్రీతి తండ్రి

ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలో ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు.

ముగిసిన అంత్యక్రియలు.. హత్యేనంటున్న ప్రీతి తండ్రి
X

ప్రీతి ఆత్మహత్య కేసులో ఇది మరో ట్విస్ట్.. ఆమెది ఆత్మహత్య కాదు, హత్యేనంటూ తండ్రి నరేంద్ర ఆరోపించారు. తన కూతురు ఎలా చనిపోయిందో సమగ్ర నివేదిక కావాలని కోరారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ తో పాటు అనస్థీషియా హెచ్‌ఓడీని సస్పెండ్ చేసిన తర్వాతే ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. మరోవైపు ఈ కేసులో ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్‌ (HRC)ని ఆశ్ర యించింది. ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జేఏసీ కోరింది. ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని HRCలో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్‌ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించారని ఫిర్యాదు చేసింది. నిమ్స్‌, గాంధీ ఆస్పత్రిలో పోలీసుల వ్యవహర తీరుపై విచారణ చేపట్టాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

ముగిసిన అంత్యక్రియలు..

సీనియర్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి, ఐదు రోజులపాటు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలో ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు.

మరోవైపు ప్రీతిని వేధించిన కేసులో పీజీ సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ పై వరంగల్‌ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సైఫ్ ఖమ్మం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సైఫ్‌ ను ఎంజీఎం ఆస్పత్రి అధికారులు విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నేరం రుజువైతే మెడికల్‌ కాలేజీ నుంచి కూడా సైఫ్ సస్పెండ్ అవుతాడు. ప్రీతి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపిన వైద్యుల బృందం తమ నివేదికను డీఎంఈకి పంపింది.

First Published:  27 Feb 2023 9:51 AM GMT
Next Story