Telugu Global
Telangana

కేసీఆర్‌పై రాహుల్‌ వ్యాఖ్యలకు ప్రశాంత్ కిశోర్ కౌంటర్‌

సోనియాగాంధీ మీద కూడా ఎలాంటి ఈడీ, సీబీఐ కేసుల వేధింపులు లేవు కదా.. ఆమెను కూడా బీజేపీ ఏజెంట్‌గా భావించవ‌చ్చా అంటూ రాహుల్‌గాంధీని ప్రశ్నించారు ప్రశాంత్ కిషోర్‌.

కేసీఆర్‌పై రాహుల్‌ వ్యాఖ్యలకు ప్రశాంత్ కిశోర్ కౌంటర్‌
X

సీఎం కేసీఆర్, బీఆర్ఎస్‌ పార్టీ బీజేపీ ఏజెంట్‌ అంటూ ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్‌ ప్రశాంత్ కిశోర్‌. కేవలం సీబీఐ, ఈడీ దర్యాప్తు లేనంత మాత్రాన బీజేపీ ఏజెంట్‌ అని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇదేం అర్థం లేని వాదన అంటూ రాహుల్ గాంధీకి చురకలు అంటించారు.

సోనియాగాంధీ మీద కూడా ఎలాంటి ఈడీ, సీబీఐ కేసుల వేధింపులు లేవు కదా.. ఆమెను కూడా బీజేపీ ఏజెంట్‌గా భావించవ‌చ్చా అంటూ రాహుల్‌గాంధీని ప్రశ్నించారు ప్రశాంత్ కిషోర్‌. ప్రతిపక్షాలను సీబీఐ, ఈడీ కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్న మాట నిజమేనన్న ప్రశాంత్ కిషోర్‌.. కానీ కేసులు లేని ప్రతి ఒక్కరూ బీజేపీ ఏజెంట్‌ అని ఆరోపించడం మూర్ఖత్వమ‌న్నారు.


ఇటీవల విజయ భేరీ మొదటి విడత బస్సు యాత్రలో పాల్గొన్న రాహుల్‌గాంధీ.. కేంద్రంలోని బీజేపీ తనపై కేసులు పెట్టిందని, అధికారిక బంగ్లాను లాక్కుందని ఆరోపించారు. బీజేపీపై కాంగ్రెస్ పోరాటం ఆగ‌దంటూ చెప్పారు. ఇదే సమయంలో కేసీఆర్‌పై అనేక అవినీతి ఆరోపణలున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్‌ అంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా ప్రశాంత్ కిశోర్ స్పందించారు.

First Published:  30 Oct 2023 8:45 AM GMT
Next Story