Telugu Global
Telangana

కోలుకున్న ప్రభాకర్ రెడ్డి.. నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పారంటే..?

ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన వీడియోను కుటుంబ సభ్యులు విడుదల చేశారు. ఆ వీడియోను ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.

కోలుకున్న ప్రభాకర్ రెడ్డి.. నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పారంటే..?
X

కత్తిపోటు గాయం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి కోలుకున్నారు. ఆస్పత్రి నుంచే ఆయన తన సందేశాన్ని నియోజకవర్గ ప్రజలకు పంపించారు. వారం రోజుల్లో తాను నియోజకవర్గ ప్రజల ముందుకొస్తానని అన్నారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన వీడియోను కుటుంబ సభ్యులు విడుదల చేశారు. ఆ వీడియోను ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.


‘భగవంతుడి దయ, నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీస్సులతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. వారం రోజుల్లో మీ ముందుకొస్తా, దయచేసి మీరెవరూ టెన్షన్ పడొద్దు. నేనే అక్కడికి వస్తా. ఐసీయూలో ఉన్నా కాబట్టి ఇక్కడికి వచ్చినా లోపలికి పంపించరు, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడొద్దు. నన్ను చూసేందుకు అభిమానులు ఎవరూ హైదరాబాద్‌ రావొద్దు. వారం రోజుల్లో నేనే నియోజకవర్గ ప్రజల ముందుకు వస్తా’ అని ఆ వీడియోలో తన సందేశాన్ని వినిపించారు ప్రభాకర్ రెడ్డి.

అక్టోబర్ -30న సిద్ధిపేట జిల్లా సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన కడుపులో గాయమైంది. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి, అక్కడినుంచి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ చేసి చిన్నప్రేగుని కత్తిరించి తిరిగి కుట్లు వేశారు. నాలుగు రోజులుగా ఆయన ఐసీయూలో చికిత్స పొందారు. ప్రస్తుతం కోలుకున్నారు. ఈ ఘటనలో నిందితుడు రాజుని పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టు రిమాండ్ విధించింది. సంచలనం కోసమే రాజు ఈ హత్యాయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

First Published:  3 Nov 2023 2:31 AM GMT
Next Story