Telugu Global
Telangana

పోయింది అధికారమే.. పోరాట పటిమ కాదు - కేటీఆర్

అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ కూడా నమ్మలేదన్నారు కేటీఆర్. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పిందే నిజమైందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.

పోయింది అధికారమే.. పోరాట పటిమ కాదు - కేటీఆర్
X

అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు. వారం రోజుల్లో 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్‌ది అని గుర్తుచేశారు. సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

తెలంగాణ తెచ్చింది గులాబీ జెండానే అన్నారు కేటీఆర్. తమకు అధికారం మాత్రమే పోయిందని.. పోరాట పటిమ కాదన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్‌ కంటే పదునైన గొంతు దేశంలోనే లేదన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని.. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటా ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ రాకుంటే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు ఈ నేతలకు దక్కేవా అని అడిగారు. రేవంత్ రెడ్డి పలికేవన్ని ప్రగల్భాలేనన్న కేటీఆర్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ అల్లుతున్నారని మండిపడ్డారు. అవినీతి జరిగినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటే వదిలిపెట్టేది లేదన్నారు.

అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ కూడా నమ్మలేదన్నారు కేటీఆర్. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పిందే నిజమైందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయన్నారు. ఏదైనా పథకం తెస్తే అన్ని ఆలోచించి తీసుకురావాలన్నారు. ఇక రిపబ్లిక్‌ డే సందర్భంగా గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలేనన్నారు కేటీఆర్‌. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటేనే పవర్‌ఫుల్‌ అని చెప్పారు.

First Published:  28 Jan 2024 12:36 PM GMT
Next Story