Telugu Global
Telangana

ఎన్నికల వేళ రూ.21,566 కోట్ల విలువైన పనులు.. మోదీని నమ్మేదెలా..?

మోదీ రెండు రోజుల పర్యటనతో హడావిడి చేయాలని చూస్తోంది తెలంగాణ బీజేపీ. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులంటూ ప్రజల్ని ఏమార్చే పనిలో పడ్డారు నేతలు.

ఎన్నికల వేళ రూ.21,566 కోట్ల విలువైన పనులు.. మోదీని నమ్మేదెలా..?
X

అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ రెండు రోజులు తెలంగాణలో పర్యటించబోతున్నారు. అక్టోబర్-1న మహబూబ్ నగర్ జిల్లా, అక్టోబర్-3న నిజామాబాద్ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఈ రెండు పర్యటనల సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు, మరికొన్ని ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఈ పనుల మొత్తం విలువ రూ.21,566 కోట్లు అనేది బీజేపీ ప్రచారం. ఇవన్నీ పేపర్ పై ఉన్న లెక్కలు. ఇందులో ఎంతమేర వాస్తవ రూపం దాలుస్తాయి, ఏయే పనులు కేవలం శంకుస్థాపనలకే పరిమితం అవుతాయి అనేది భవిష్యత్తులో తేలిపోతుంది. అయితే ప్రస్తుతానికి వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులు అంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోంది.

మోదీని నమ్మేదెలా..?

విభజన హామీలు నెరవేర్చలేదు

కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వలేదు

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు

పసుపు బోర్డ్ లేదు

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని, చివరకు రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చారు

పాలమూరుకి కృష్ణాజలాల వివాదంలో తెలంగాణను పట్టించుకోలేదు

రాష్ట్ర విభజన సరిగా జరగలేదంటూ పార్లమెంట్ లో తాజా ప్రసంగం..

ఇంత చేస్తున్న మోదీని తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారనేది బీఆర్ఎస్ నేతల ప్రశ్న. తెలంగాణకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా, కొత్తగా ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అంటున్నారు.

మోదీ రెండు రోజుల పర్యటనతో హడావిడి చేయాలని చూస్తోంది బీజేపీ. తెలంగాణలో బీఆర్ఎస్ ని ఎదుర్కోవడం కష్టం అని ఆ పార్టీకి అర్థమైపోయింది, ప్రతిపక్ష హోదా విషయంలో కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తోంది. ఈ దశలో ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటో తేలాల్సి ఉంది. ఐదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏకి అయినా, ఇండియా కూటమికి అయినా సెమీఫైనల్స్ లాంటివి. తెలంగాణలో కష్టకాలం అని తెలిసినా కూడా దింపుడు కళ్లెం ఆశతో మోదీ రంగంలోకి దిగారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులంటూ ప్రజల్ని ఏమార్చే పనిలో పడ్డారు. 9 ఏళ్లలో 9లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చామని చెబుతున్నారు బీజేపీ నేతలు. మోదీ పర్యటన తర్వాత సీన్ మారిపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

First Published:  30 Sep 2023 2:44 AM GMT
Next Story