Telugu Global
Telangana

తెలంగాణలో డబుల్ 'R' ట్యాక్స్‌.. రేవంత్‌ సర్కార్‌పై మోడీ విమర్శలు

తెలంగాణలో 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్‌ రైతులను మోసం చేసిందన్నారు మోడీ. వరికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదన్నారు.

తెలంగాణలో డబుల్ R ట్యాక్స్‌.. రేవంత్‌ సర్కార్‌పై మోడీ విమర్శలు
X

తెలంగాణలో డబుల్ 'R' ట్యాక్స్ నడుస్తోందన్నారు ప్రధాని మోడీ. మెదక్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. రేవంత్‌ సర్కార్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో డబుల్‌ R ట్యాక్స్ అంటే ఏంటో ఇప్పటికే అందరికీ అర్థమయి ఉంటుందన్నారు. డబుల్ ఆర్‌ ట్యాక్స్‌ను వ్యాపారవేత్తలు కట్టాల్సి వస్తోందని ఆరోపించారు మోడీ. ట్రిపుల్‌ ఆర్ సినిమాతో ప్రపంచమంతా గర్వపడితే.. డబుల్ ఆర్ ట్యాక్స్‌తో దేశం సిగ్గుపడుతోందన్నారు.


పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ సంపద నుంచి కొత్త ట్యాక్స్‌ వసూలు చేస్తారని ఆరోపించారు మోడీ. తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో నుంచి 55శాతం ఆస్తి పిల్లలకు దక్కకుండా కాజేసేందుకు కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతోందన్నారు. ఇలాంటి నిర్ణయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మోడీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడతామన్న కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్ఎస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు మోడీ.

తెలంగాణలో 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్‌ రైతులను మోసం చేసిందన్నారు మోడీ. వరికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదన్నారు. తెలంగాణను మొన్నటి వరకు బీఆర్ఎస్‌ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్‌ దోచుకుంటోందని ఆరోపించారు మోడీ. 2004లో కాంగ్రెస్‌కు మెజార్టీ ఎంపీలను గెలిపించారని కానీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను ఆ పార్టీ కాలరాసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలంగా ఉందన్నారు మోడీ. రాజ్యాంగంపైనా, అంబేద్కర్‌పైనా కాంగ్రెస్‌కు గౌరవం లేదన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేది బీజేపీ మాత్రమేనన్నారు.

First Published:  30 April 2024 6:46 PM GMT
Next Story