Telugu Global
Telangana

బంకుల్లో గ‌ప్‌`చిప్‌`గా.. - చిప్‌తో పెట్రోల్ కాజేత‌.. హైద‌రాబాద్‌లో వెలుగుచూసిన భారీ మోసం

చిప్‌లు అమర్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు.. అతడిని విచారించారు. నగర వ్యాప్తంగా 18 పెట్రోల్ బంకుల్లో చిప్స్ అమర్చినట్లు నిందితుడు అంగీక‌రించాడు.

బంకుల్లో గ‌ప్‌`చిప్‌`గా.. - చిప్‌తో పెట్రోల్ కాజేత‌.. హైద‌రాబాద్‌లో వెలుగుచూసిన భారీ మోసం
X

హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంక్‌ల మోసాలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించే విధంగా చిప్స్ అమర్చిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఈ ప్రత్యేక చిప్‌ల ద్వారా జనాలని మోసం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ చిప్‌లతో పెట్రోల్‌కు గండి కొడుతున్నారు. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఎస్ఓటీ (స్పెష‌ల్ ఆప‌రేష‌న్ టీమ్‌) నిర్వ‌హించిన ఆకస్మిక సోదాల్లో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

శివరాంపల్లి ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన జీవైఎస్ రెడ్డి పెట్రోల్ బంకులో సోదాలు చేపట్టగా.. పెట్రోల్, డీజిల్ మెషీన్‌లో సాఫ్ట్‌వేర్ సహాయంతో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చిప్‌తో లీటర్‌కు 10 రూపాయల మేర‌కు గండి కొడుతూ వాహనదారులను బంక్ యజమాని నిలువు దోపిడీ చేస్తున్నాడు. ఇలా ఏటా కోట్ల రూపాయ‌ల్లోనే దండుకుంటున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చీకటి దందా జరుగుతోంది. చిప్‌లు అమర్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు.. అతడిని విచారించారు. నగర వ్యాప్తంగా 18 పెట్రోల్ బంకుల్లో చిప్స్ అమర్చినట్లు నిందితుడు అంగీక‌రించాడు.

పట్టుబడ్డ నిందితుడి సహాయంతో.. మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్‌లపై అధికారులు దాడులు చేశారు. తూనికలు, కొలతలు, పౌరసరఫరాల శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్థానిక పోలీసులతో క‌ల‌సి మూకుమ్మ‌డిగా బుధ‌వారం రాత్రి నుంచి ఈ దాడులు నిర్వ‌హించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని బంకుల్లో చిప్‌లు అమ‌ర్చిన‌ట్టు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకుని బంకుల‌ను సీజ్ చేశారు. యజమానిపై గురువారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డీలర్‌ షిప్‌ను అధికారుల బృందం రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

First Published:  18 Nov 2022 7:09 AM GMT
Next Story