Telugu Global
Telangana

అసలే వారాంతం.. కేసీఆర్ కోసం బారులు తీరిన జనం

ప్రగతిభవన్‌లో బయలుదేరిన తర్వాత హైదరాబాద్ సిటీలోనే సీఎం కేసీఆర్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. సికింద్రాబాద్ దాటిన తర్వాత రోడ్డు పక్కన వేలాది మంది ప్రజలు, అభిమానులు నిలబడ్డారు.

అసలే వారాంతం.. కేసీఆర్ కోసం బారులు తీరిన జనం
X

ఉప ఎన్నిక మునుగోడులో జరుగుతుందా.. లేక హైదరాబాద్‌లో జరుగుతుందా అని అందరూ ఆశర్చర్యపోతున్నారు. మునుగోడు ఉపఎన్నిక కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభ శనివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభం కావల్సి ఉన్నది. సీఎంవో కూడా కేసీఆర్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రగతిభవన్ నుంచి మునుగోడుకు రోడ్డు మార్గంలో బయలుదేరి 2.00 గంటలకు చేరుకుంటారని ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వెళ్తే.. పోలీసులు రోడ్డు క్లియర్ చేసి చాలా వేగంగా కాన్వాయ్ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. శనివారం కూడా అలాగే హైదరాబాద్, రాచకొండ పోలీసులు రోడ్ క్లియరెన్స్ ఇచ్చారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎప్పటిలాగా వేగంగా గమ్యస్థానానికి చేరుకోలేకపోయారు.

ప్రగతిభవన్‌లో బయలుదేరిన తర్వాత హైదరాబాద్ సిటీలోనే సీఎం కేసీఆర్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. వీకెండ్ కావడంతో ఇన్నర్‌ రింగ్ రోడ్‌ను పోలీసులు ఎంచుకున్నారు. పెద్దగా ట్రాఫిక్ ఉండదని కూడా భావించారు. కానీ సికింద్రాబాద్ దాటిన తర్వాత రోడ్డు పక్కన వేలాది మంది ప్రజలు, అభిమానులు నిలబడ్డారు. చేతిలో గులాబీ జెండాలు పట్టుకొని నిలబడటంలో కాన్వాయ్‌ని నెమ్మదిగా పోనిమ్మని సీఎం చెప్పినట్లు తెలుస్తున్నది. దీంతో చాలా స్లోగా కాన్వాయ్ ముందుకు సాగింది. హబ్సిగూడ నుంచి ఉప్పల్ వరకు ప్రజలు, అభిమానులు కేసీఆర్‌కు అభివాదం తెలిపారు. ప్రత్యేక బస్సు నుంచే అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ఉప్పల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్ర‌హం వద్ద వందలాది మంది ప్రజలు గుమ్మికూడారు. అయితే ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతుందని కేసీఆర్ ముందుకు వెళ్లిపోయారు. నాగోల్, ఎల్బీనగర్, పనామా నుంచి వెళ్తున్న కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే.. సుదీర్ఘంగా సాగిన ఈ ప్రయాణం కారణంగా మునుగోడు సభకు కేసీఆర్ ఇంత వరకు చేరుకోలేదు. 2 గంటలకు ప్రారంభం కావల్సిన సభ.. సాయంత్రం 4 అయినా ప్రారంభం కాలేదంటే కేసీఆర్ ప్రయాణం ఎంత సుదీర్ఘంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

వీకెండ్‌తో పాటు శ్రీ‌కృష్ణ‌జన్మాష్టమి సందర్భంగా పాఠశాలలకు కూడా సెలవులు ఉండటంతోనే సీఎం కేసీఆర్ తన కాన్వాయ్‌ని నెమ్మదిగా వెళ్లమని చెప్పినట్లు తెలుస్తున్నది. సాధారణంగా సిటీలో ప్రజలు వీఐపీల కాన్వాయ్‌ని పెద్దగా పట్టంచుకోరు. కానీ ఇవ్వాళ‌ చాలా మంది సీఎం కేసీఆర్ మునుగోడు పర్యటనను చూడటానికి వచ్చినట్లే ఉందని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.

First Published:  20 Aug 2022 10:36 AM GMT
Next Story