Telugu Global
Telangana

రెబల్‌ అభ్యర్థిగా పటేల్ రమేష్ రెడ్డి..?

ఫైనల్‌ లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో రమేష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. ఫోన్‌కు సైతం అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు రమేష్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

రెబల్‌ అభ్యర్థిగా పటేల్ రమేష్ రెడ్డి..?
X

పటేల్‌ రమేష్‌ రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. గతంలో సర్పంచ్‌, జెడ్పీటీసీగా పనిచేసిన రమేష్‌ రెడ్డి.. 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్‌పై సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో దాదాపు 38 వేలకుపైగా ఓట్లు సాధించారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్‌ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అయితే తర్వాత కాంగ్రెస్‌ టికెట్‌పై ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు.

2018 ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం ద‌క్క‌లేదు. అప్పుడే ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆయన పార్టీలోనే కొనసాగారు. ఈసారి కచ్చితంగా తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో.. పటేల్ రమేష్‌ రెడ్డి ప్రచార రథాలను సైతం సిద్ధం చేసుకున్నారు. కానీ, పటేల్ ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లింది. మరోసారి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికే సూర్యాపేట నుంచి అవకాశం ఇచ్చింది.

ఫైనల్‌ లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో రమేష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. ఫోన్‌కు సైతం అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు రమేష్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. పార్టీ నేతల బుజ్జగింపులకు లొంగుతారా.. లేదా రెబల్‌గా బరిలో ఉంటారా..? అనేది తేలాల్సి ఉంది. ఇక సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి జగదీశ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర రావు బరిలో ఉన్నారు. రమేష్ రెడ్డి రెబల్‌గా బరిలో ఉంటే సూర్యాపేటలో సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  10 Nov 2023 4:05 AM GMT
Next Story