Telugu Global
Telangana

సూర్యాపేట కాంగ్రెస్‌లో పటేల్‌ రమేష్‌రెడ్డి టెన్షన్

రమేష్‌రెడ్డిని బుజ్జగించి బరిలో లేకుండా చూడాలని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరి పటేల్ రమేష్‌రెడ్డి అధిష్టానం మాట విని పోటీ నుంచి తప్పుకుంటారా.. లేదా బరిలో నిలిచి ప్రతీకారం తీర్చుకుంటారా..?

సూర్యాపేట కాంగ్రెస్‌లో పటేల్‌ రమేష్‌రెడ్డి టెన్షన్
X

సూర్యాపేట రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు పటేల్ రమేష్‌ రెడ్డి టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా హస్తం పార్టీలో పటేల్ దడ మొదలైంది. టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ రెబల్‌ క్యాండిడేట్‌గా బరిలోకి దిగుతున్నారు పటేల్ రమేష్‌ రెడ్డి. దీంతో కాంగ్రెస్‌ ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది.

రమేష్‌రెడ్డి రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 15వరకు గడువు ఉంది. అప్పటిలోగా రమేష్‌రెడ్డిని బుజ్జగించి బరిలో లేకుండా చూడాలని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరి పటేల్ రమేష్‌రెడ్డి అధిష్టానం మాట విని పోటీ నుంచి తప్పుకుంటారా.. లేదా బరిలో నిలిచి ప్రతీకారం తీర్చుకుంటారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడిచింది. బీఆర్ఎస్‌ అభ్యర్థి, మంత్రి జగదీశ్‌రెడ్డికి 68వేల 650ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి 62వేల 683 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ క్యాండిడేట్ సంకినేని వెంకటేశ్వరరావుకు 39వేల ఓట్లు వచ్చాయి. మంత్రి జగదీష్‌రెడ్డి కేవలం 5వేల 697ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. ఈసారి పటేల్ రమేష్‌రెడ్డి రెబల్‌గా బరిలోకి దిగితే.. సూర్యాపేట సమరం మరింత రసవత్తరంగా మారనుంది.

First Published:  11 Nov 2023 9:05 AM GMT
Next Story