Telugu Global
Telangana

నన్ను చంపాలనుకున్నారు.. కౌశిక్ రెడ్డి రివర్స్ అటాక్

ఈటల అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు కౌశిక్ రెడ్డి. ఓటమి భయంతో ఈటల అన్ని పార్టీల దగ్గరకు తిరుగుతున్నాడని, దాన్ని కప్పి పుచ్చుకోడానికే భార్యతో హత్య, కుట్ర అనే ఆరోపణలు చేయించారని అన్నారు.

నన్ను చంపాలనుకున్నారు.. కౌశిక్ రెడ్డి రివర్స్ అటాక్
X

ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందని, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి 20కోట్లు సుపారీ ఇచ్చారని ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండించారు కౌశిక్ రెడ్డి. అసలు కుట్ర జరిగింది తనపైనే అని చెప్పుకొచ్చారు. 2018లోనే తనను చంపించాలని ఈటల కుట్ర చేశారని అన్నారు. తనపై చేసిన ఆరోపణలపై హుజూరాబాద్‌ నడిబొడ్డున బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు కౌశిక్ రెడ్డి. తనను హత్య చేసే ఉద్దేశంతోనే ముందే బట్టకాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలు చేసేది తాను కాదని, ఈటల రాజేందరేనని ఆరోపించారు.

ఈటల రాజేందర్‌ భార్య జమున, గతంలో ముదిరాజ్‌లను చిన్న కులం అంటూ మాట్లాడి అవమానించారని చెప్పారు కౌశిక్ రెడ్డి. ముదిరాజ్ లకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈటల రాజేందర్‌‌ కు ఒకప్పుడు ఇల్లు కూడా సరిగా లేదని, ఇప్పుడు వందల కోట్లతో 5 ఎకరాల్లో కోట కట్టుకున్నాడని, అదంతా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులు, బీసీల భూముల్ని ఈటల కుటుంబం లాక్కుందని విమర్శించారు. ఈటలను ఓడించే వరకు తాను విశ్రమించేది లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు ఓటమి తప్పదన్నారు కౌశిక్ రెడ్డి.

బంగారు గుడ్లు పెడుతున్నాయా..?

ఈటల రాజేందర్ ఇప్పుడు చీటర్ రాజేందర్‌ అని ఎద్దేవా చేశారు కౌశిక్ రెడ్డి. కోళ్లఫారాలు పెట్టుకున్న వ్యాపారులు దివాళా తీస్తుంటే ఈటల మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నారని అది ఎలా సాధ్యమైందన్నారు. ఆయన పెంచే కోళ్లు బంగారు గుడ్లు పెడుతున్నాయా అన ప్రశ్నించారు. ఈటల అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు కౌశిక్ రెడ్డి. ఓటమి భయంతో ఈటల అన్ని పార్టీల దగ్గరకు తిరుగుతున్నాడని, దాన్ని కప్పి పుచ్చుకోడానికే భార్యతో హత్య, కుట్ర అనే ఆరోపణలు చేయించారని అన్నారు.

First Published:  27 Jun 2023 2:43 PM GMT
Next Story