Telugu Global
Telangana

తెలంగాణ ప్రతిపక్ష నేతలు మంచి నవలా రచయితలు : మంత్రి కేటీఆర్ చలోక్తులు

రేవంత్ చేసే జోకులు మామూలుగా ఉండవు.. వాటికి సరైన ఆధారాలు కూడా ఉండవంటూ క్రిషాంక్ ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రతిపక్ష నేతలు మంచి నవలా రచయితలు : మంత్రి కేటీఆర్ చలోక్తులు
X

తెలంగాణలోని ప్రతిపక్ష నాయకులు మంచి నవలా రచయితలు కాగలరని ఐటీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక్కడి నాయకులు ఊహించుకోవడంలో చాలా ముందుంటారని.. అలా మంచి రచయితలు కాగలరని ఆయన అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల మంత్రి కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలను ఉటంకిస్తూ తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ ఒక ట్వీట్ చేశారు.

రేవంత్ చేసే జోకులు మామూలుగా ఉండవు.. వాటికి సరైన ఆధారాలు కూడా ఉండవంటూ క్రిషాంక్ ట్వీట్ చేశారు. పాత సెక్రటేరియట్ కింద కేటీఆర్‌కు నిజాం నగలు దొరికాయని.. కేటీఆర్ బావ రూ.10 వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్టును చేజిక్కించుకున్నారని.. కేటీఆర్ పీఏ సంబంధీకులకు గ్రూప్-1లో అత్యధిక మార్కులు వచ్చాయంటూ రేవంత్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ జోకులే.. వాటికి అసలు ఇంత వరకు ఆయన ఆధారాలు చూపలేదు అంటూ క్రిషాంక్ పోస్ట్ చేశారు.

క్రిషాంక్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై చలోక్తులు విసిరారు. రేవంత్ రెడ్డి పూర్తిగా తన మైండ్ కోల్పోయాడు. అతనికి పిచ్చి పట్టినట్లు ఉన్నది. తెలంగాణ ప్రతిపక్ష నాయకులకు ఊహాజనితమైన దృష్టి ఎక్కువ. వారికి ఇలాంటి విపరీతమైన ఆలోచనలు వస్తాయి. వీళ్లందరూ తప్పకుండా మంచి నవలాకారులు కాగలరు. వారికి నా ముందస్తు శుభాకాంక్షలు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.


First Published:  20 March 2023 5:27 AM GMT
Next Story