Telugu Global
Telangana

అప్పుడే అసలైన సంక్రాంతి, సంపూర్ణ క్రాంతి –కేసీఆర్

తెలంగాణ రైతాంగం సుఖ సంతోషాలతో ఉన్నట్టే.. యావత్ భారత రైతాంగం సంతోషంగా ఉన్నరోజు అసలైన సంక్రాంతి అని, రైతాంగానికి సంపూర్ణ క్రాంతి అని చెప్పారు.

అప్పుడే అసలైన సంక్రాంతి, సంపూర్ణ క్రాంతి –కేసీఆర్
X

భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన రోజే.. సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని అన్నారు కేసీఆర్. ధాన్యపు రాశులు ఇళ్లకు చేరుకునే రోజు సంక్రాంతి అని, భూమి తల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో పచ్చని పంట పొలాలు, ధాన్యరాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. సాగులో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని అన్నారు.

రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి 1.31 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం, ఇప్పుడు 2.04లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం తెలంగాణలో నేడు పండుగ అయిందని, వ్యవసాయరంగాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో తొణికిసలాడుతోందన్నారు. ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదు కొల్పుతామని హామీ ఇచ్చారు.

భారత ప్రజల సహకారంతో, సమష్టి కృషితో దేశ వ్యవసాయ రంగ నమూనాను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్ది కి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని, తెలంగాణ రైతాంగం సుఖ సంతోషాలతో ఉన్నట్టే.. యావత్ భారత రైతాంగం సంతోషంగా ఉన్నరోజు అసలైన సంక్రాంతి అని, రైతాంగానికి సంపూర్ణ క్రాంతి అని చెప్పారు. ప్రజలంతా సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనీ, ప్రతి ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

First Published:  14 Jan 2023 6:05 AM GMT
Next Story