Telugu Global
Telangana

గుట్టు వీడిన ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్లు

రాజగోపాల్ రెడ్డి అకౌంట్ నుంచి రూ. 5.22కోట్లు మునుగోడు పరిధిలోని 23 బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయింది. మర్రిగూడ, మునుగోడు, విద్యానగర్, రామ్ నగర్, చౌటుప్పల్, పంతంగి లోని బ్యాంక్ అకౌంట్లకు సుశీ ఇన్ ఫ్రా నుంచి సొమ్ము బదిలీ అయింది.

గుట్టు వీడిన ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్లు
X


మునుగోడు నోట్ల రాజకీయం మరోసారి బట్టబయలైంది. ఇప్పటి వరకూ వాహనాల్లో తరలిస్తున్న సొమ్ము మాత్రమే పట్టుబడింది. ఇప్పుడు ఏకంగా ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా జమ చేసిన సొమ్ము గుట్టు వీడింది. 5.22కోట్ల రూపాయలను ఓట్ల కొనుగోలు కోసం మునుగోడుకి తరలించారు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. ఎవరికీ అనుమానం రాకుండా బ్యాంక్ అకౌంట్లలోకి నగదు బదిలీ చేశారు. రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి 5.22 కోట్ల రూపాయలు మునుగోడు నియోజకవర్గ పరిధిలోని 23 బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఈ అకౌంట్లతో అసలు సుశీ ఇన్ ఫ్రా కంపెనీకి సంబంధమే లేదు. వారి మధ్య వ్యాపార లావాదేవీలు కూడా లేవు. మరి అంత సడన్ గా ఈ అకౌంట్లకు డబ్బులెందుకెళ్లాయనే ప్రశ్న తలెత్తుతోంది.

సాక్ష్యాధారాలు సేకరించిన టీఆర్ఎస్..

మర్రిగూడ బ్రాంచ్ లోని రెండు అకౌంట్లకు 50లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. మునుగోడు, విద్యానగర్, రామ్ నగర్, చౌటుప్పల్, పంతంగి లోని ఇతర బ్యాంక్ అకౌంట్లకు మిగతా సొమ్ము బదిలీ అయింది. సుశీ ఇన్ ఫ్రా నుంచి ఏయే అకౌంట్లకు ఎంత సొమ్ము బదిలీ అయిందనే సమాచారాన్ని సేకరించిన టీఆర్ఎస్ నాయకులు.. దాన్ని ఎన్నికల కమిషన్ కి అందించారు. జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల వ్యయ పరిశీలకుడు, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ సహా ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ సమాచారాన్ని పంపించి బీజేపీ అభ్యర్థిపై ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమా భరత్ కుమార్ పేరుతో పూర్తి వివరాలున్న లేఖను ఎన్నికల కమిషన్ కి పంపారు.







ఆ ఆకౌంట్లు ఫ్రీజ్ చేయండి..

రాజగోపాల్ రెడ్డి నగదు బదిలీ చేసిన అకౌంట్లనుంచి డబ్బు డ్రా చేయకుండా వెంటనే వాటిని ఫ్రీజ్ చేయాలంటూ టీఆర్ఎస్ కోరింది. నగదు విత్ డ్రా జరిగితే, కచ్చితంగా ఓటర్లకు చేరవేసే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఈ ఓట్ల కొనుగోలుని అడ్డుకోవాలంటున్నారు టీఆర్ఎస్ నేతలు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు దక్కించుకున్న రాజగోపాల్ రెడ్డి, అందులో 5.22 కోట్ల రూపాయలను ఓట్ల కొనుగోలు కోసం ట్రాన్స్ ఫర్ చేశారని అంటున్నారు. ఈ సొమ్ము ఓటర్ల చేతిలో పడకూడదంటే వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

First Published:  29 Oct 2022 4:11 PM GMT
Next Story