Telugu Global
Telangana

అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు.. ఎందుకంటే ..

2019-2022 మధ్య ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్లాది రూపాయల గోల్‌మాల్ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ హెచ్‌సీఏ సీఈవో సునీల్ ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఉన్నారు.

అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు.. ఎందుకంటే ..
X

నిధుల గోల్ మాల్ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. హెచ్‌సీఏపై తాజాగా నాలుగు కేసులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. 2019- 2022 మధ్య అపెక్స్‌ కౌన్సిల్‌ ఉన్న సమయంలో BCCI నుంచి వచ్చిన నిధులు, ఖర్చు చేసిన విధానం, టెండర్లు, కొటేషన్లు వంటివాటిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో అవకతవకలు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 2019-2022 మధ్య ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్లాది రూపాయల గోల్‌మాల్ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ హెచ్‌సీఏ సీఈవో సునీల్ ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అధ్యక్షుడిగా అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్‌మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, సంయుక్త కార్యదర్శిగా నరేశ్‌ శర్మ, కోశాధికారిగా సురేందర్‌ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ ఉన్నారు. దీంతో అజారుద్దీన్‌పై ఐపీసీ 406, 409, 420, 465, 467, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుల ప్రకారం సుమారు రూ.20 కోట్ల వరకూ కుంభకోణం జరిగిందని తెలుస్తోంది.

హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై గ‌తంలోనూ కేసులు, వివాదాలు ఉన్నాయి. ఆ వివాదం సుప్రీంకోర్టు కు చేరింది. ఆ పరిస్థితుల్ని చక్కదిద్ది ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు 14 ఫిబ్రవరి 2023న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. లావు నాగేశ్వరరావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. దీంతో రానున్నహెచ్‌సీఏ ఎన్నికల్లో అజరుద్దీన్ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.

ఈ ఏడాది అక్టోబరు 20న హెచ్‌ఏసీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటల్లోపు హెచ్‌​సీఏ ఎన్నికల అధికారి ఫలితాలను ప్రకటించనున్నారు.


First Published:  19 Oct 2023 3:14 PM GMT
Next Story