Telugu Global
Telangana

కోరుట్లపై ఎంపీ అర్వింద్ స్పెషల్‌ ఫోకస్‌

గత కొద్ది రోజులుగా కోరుట్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు అర్వింద్. లోకల్‌ లీడర్లతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోరుట్ల నుంచి బరిలో దిగనున్నారని ప్రచారం జరుగుతోంది.

కోరుట్లపై ఎంపీ అర్వింద్ స్పెషల్‌ ఫోకస్‌
X

కోరుట్ల నియోజకవర్గంపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి అర్వింద్‌ పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచిన తర్వాత ఇక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించగా..ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలిపిస్తామని అర్వింద్ హామీ ఇస్తున్నారు.

నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కోరుట్ల మెట్‌పల్లి నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఈ నియోజకవర్గం గతంలో బీజేపీకి కంచుకోట. 1985, 89, 94 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌ రావు ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 2009లో మెట్‌పల్లి రద్దయి కోరుట్ల నియోజకవర్గం ఏర్పడింది. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారడం, తెలంగాణ ఉద్యమం బలపడడంతో బీజేపీ క్రమంగా బలహీనపడింది.

2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ పుంజుకుంది. మెట్‌పల్లికి చెందిన పలువురు ప్రముఖులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా కోరుట్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు అర్వింద్. లోకల్‌ లీడర్లతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోరుట్ల నుంచి బరిలో దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న నినాదంతో ముందుకెళ్లాలని అర్వింద్ భావిస్తున్నారట. నియోజకవర్గంలో దాదాపు 80 వేల మంది చెరకు, పసుపు రైతులు ఉన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు ఈ సారి బీఆర్ఎస్‌ అవకాశం ఇచ్చింది.


First Published:  18 Oct 2023 3:10 AM GMT
Next Story