Telugu Global
Telangana

నిజాం వారసుడు.. హాలీవుడ్ లో ప్రముఖ కెమెరామెన్

దిగ్గజ దర్శకులు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, రిచర్డ్‌ అటెన్‌ బరోలతో కూడా అజ్మత్ జా కలిసి పనిచేశారు. షార్ట్ ఫిల్మ్ లు, డాక్యుమెంటరీలు కూడా చిత్రీకరించారు.

నిజాం వారసుడు.. హాలీవుడ్ లో ప్రముఖ కెమెరామెన్
X

హైదరాబాద్ నిజాం కుటుంబానికి నూతన వారసుడిగా మీర్‌ మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ అజ్మత్‌ జా ఎంపికైన విషయం తెలిసిందే. ఆయన ప్రిన్స్ ముకర్రమ్ జా కుమారుడు. అసలు అజ్మత్ జా ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజాం కుటుంబ సభ్యులు లండన్ సహా అనేక ఇతర దేశాలకు వలస వెళ్లి జీవిస్తున్నారు. ముకర్రమ్ జా తనయుడు అస్మత్ జా కూడా లండన్ లోనే నివశిస్తున్నారు. ఆయన విద్యాభ్యాసం అంతా లండన్ లోనే జరిగింది.




1960లో జన్మించిన అజ్మత్‌ జా లండన్‌ లోనే ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఫొటోగ్రఫీ అంటే ఆయనకు ప్రాణం. దాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఫొటోగ్రఫీలో డిగ్రీ పట్టా పొందారు. హాలీవుడ్‌ లో కొన్ని సినిమాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీగా ఆయన విధులు నిర్వహించారు. దిగ్గజ దర్శకులు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, రిచర్డ్‌ అటెన్‌ బరోలతో కూడా అజ్మత్ జా కలిసి పనిచేశారు. షార్ట్ ఫిల్మ్ లు, డాక్యుమెంటరీలు కూడా చిత్రీకరించారు. లండన్‌ లో నివసిస్తున్న ఆయన.. డాక్యుమెంటరీల చిత్రీకరణకోసం ఇతర దేశాలకు వెళ్లి వస్తుంటారు. ఆయనకు దేశ విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది.

చౌమహల్లా ప్యాలెస్ ప్రకటన..

తండ్రి ముకర్రమ్‌ జా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వారం రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు అజ్మత్ జా. పాతబస్తీలోని పూర్వీకుల నివాసంలో ఆయన బస చేశారు. హైదరాబాద్‌ నిజాం కుటుంబంలో ప్రిన్స్ ముకర్రమ్ జా మరణంతో ఆయన వారసుడి ఎంపిక కూడా వారి లాంఛనాల ప్రకారమే ముగిసింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహించినట్టు చౌమహల్లా ప్యాలెస్‌ నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

First Published:  22 Jan 2023 4:17 AM GMT
Next Story