Telugu Global
Telangana

పంప్ హౌజ్ లు ప్రాజెక్టుల దగ్గర కాకపోతే పరేడ్ గ్రౌండ్ లో కడతారా? 'బండి' ని ఉతికి ఆరేస్తున్న నెటిజనులు

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దాని అధ్యక్షుడు బండి సంజయ్, ఎలాగైనా చేసి అర్జెంట్ గా కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి అధికార పీఠంపై తాము కూర్చోవాలన్న తహతహలో లాజిక్ లు కూడా మర్చి పోయి మాట్లాడుతున్నారు.

పంప్ హౌజ్ లు ప్రాజెక్టుల దగ్గర కాకపోతే పరేడ్ గ్రౌండ్ లో కడతారా? బండి ని ఉతికి ఆరేస్తున్న నెటిజనులు
X

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, దాని అధ్యక్షుడు బండి సంజయ్, ఎలాగైనా చేసి అర్జెంట్ గా కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి అధికార పీఠంపై తాము కూర్చోవాలన్న తహతహలో లాజిక్ లు కూడా మర్చి పోయి మాట్లాడుతున్నారు. ప్రతీ దాన్నీ రాజకీయం చేయడమే తమ విధిగా భావిస్తున్నారు.

ఒకవైపు భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళను రక్షించి ఆ ఇబ్బందుల నుంచి గట్టెంక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శక్తులను మోహరిస్తూ ఉంది. మరో వైపు బండి సంజయ్ మాత్రం వరద రాజకీయాలు మొదలు పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి లక్షలాది ఎకరాల భూములకు సాగు నీరందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పై కట్టిన నాటి నుంచే విమర్షలు ఎక్కుపెడుతున్న బండిసంజయ్ ఈ వరదల సమయంలో మళ్ళీ మొదలుపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన అన్నారం పంప్ హౌజ్ భారీ వరదల కారణంగా నీట మునిగింది. ఇక దొరికిందే సందన్నట్టు బండిసంజయ్ తన ఆవు వ్యాసాన్ని సంచిలోంచి బైటికి తీశారు. ''ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం వల్లే అన్నారం పంప్ హౌజ్ నీటమునిగింది. అంచనాల వ్యయాన్ని పెంచి వేల కోట్లు దోచుకోవడంలో చూపిన శ్రద్ద ప్రాజెక్టు నిర్మాణంలో చూపకపోవడం సిగ్గు చేటు'' అని ట్వీట్ చేశారు.

అయితే బండి సంజయ్ చేసిన ట్వీట్ పై నెటిజనులు విరుచుకపడుతున్నారు. ప్రాజెక్టుల గురించి, వరదల గురించి కనీస అవగాహన ఉన్నవాళ్ళెవ్వరూ ఇలా మాట్లాడరని సంజయ్ కి వాతలు పెడుతున్నారు.

''మనం ఎన్నడన్నా ప్రాజెక్టులు కట్టిన మొఖం అయితే కదా నది పక్కనే పంప్ హౌస్ కడతారని, భారీ వరద వచ్చినప్పుడు పంప్ హౌస్ లోకి నీళ్ళు రావడం సహజమేనని తెలిసేది..

వరద తగ్గగానే ఆ పంపులు మళ్ళీ నీళ్ళు తోడుతాయి. మీరు రోజూ చిమ్మే బురదను సమూలంగా ప్రక్షాళన చేస్తాయి.'' అని టీఆరెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను వందలాది మంది నెటిజనులు రీ ట్వీట్ చేస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు.


''పంప్ హౌజ్ ప్రాజెక్టు పక్కనే కట్టకుండా ఖాళీగా ఉందని పరేడ్ గ్రౌండ్ల కడుతరా'' అని సుధీర్ కుమార్ తాండ్ర అనే నెటిజన్ ఫేస్ బుక్ లో కామెంట్ చేయగా

''నువ్వు ట్వీట్ చేయటంలో చూపిన శ్రద్ద కాళేశ్వరం పై వాస్తవాలు తెల్సుకోవడం పైన చూపెట్టివుంటే బాగుండు సిగ్గు సిగ్గు'' అని మరో నెటిజన్ ట్విట్టర్ లో కామెంట్ చేశారు.

''ప్రాజెక్టు లకు నిధులు తేవడం చేతకాదు.కట్టబోయే ప్రాజెక్టులకు అడుగడుగున పుల్ల‌లు వేయడం మాత్రం వస్తాది.

ఎంతో వ్యయప్రయాసలను లేక్కచేయక నిర్మించిన ప్రాజెక్టు పై మీకు కుళ్ళు ఎందుకు ? ప్రజలు నీటి గోసనుండి బయటకు రావడం ఇష్టం లేదని ఇలా నిరూపించుకుంటున్నారా .?'' అని మరో నెటిజన్ బండి సంజయ్ పై విరుచుకపడ్డారు.

''బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎలా అయ్యాడో అర్ధం కావటంలేదు. నదీ తీరాన ఉన్నటువంటి పంప్ హౌజ్ మునిగింది అంటే దానికి అర్థం ఉంది. కానీ బీహార్ డిప్యూటీ సీఎం ఇల్లు మునిగిపోయి రోడ్డు మీదకు వచ్చాడు. మరి దీని గురించి బండి సంజయ్ ఏం మాట్లాడతారు అని మరో నెటిజన్ ప్రశ్నించారు.

మొత్తానికి ట్విట్టర్ లో ఇవ్వాళ్ళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని నెటిజనులు ఉతికి ఆరేస్తున్నారు.

First Published:  15 July 2022 7:21 AM GMT
Next Story