Telugu Global
Telangana

బ్లాక్ జాదూ పార్టీ(బీజేపీ).. క్షుద్ర పూజలంటూ డైవర్షన్ పాలిటిక్స్..

గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇలాంటి స్ట్రాటజీలనే ఉపయోగించింది. బీహార్ ఎన్నికల సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ తాంత్రిక పూజలు చేశారంటూ బీజేపీ ఆరోపించింది.

బ్లాక్ జాదూ పార్టీ(బీజేపీ).. క్షుద్ర పూజలంటూ డైవర్షన్ పాలిటిక్స్..
X

బీజేపీ అంటే బ్లాక్ జాదూ పార్టీ అంటూ కొత్త నిర్వచనం ఇస్తున్నారు నెటిజన్లు. క్షుద్రపూజలు, బ్లాక్ మ్యాజిక్ అంటూ టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు విమర్శలు ఎక్కు పెడుతున్న వేళ, బీజేపీని ఏకంగా బ్లాక్ జాదూ పార్టీ అంటూ అభివర్ణిస్తున్నారు. కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనంటున్నారు.

దొరికిపోతే అంతేగా..

ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18వేలకోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులకు తాను అమ్ముడుపోయానంటూ బహిరంగంగా ఒప్పుకున్నారు. దీంతో బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది. రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, బీజేపీ ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చింది, ఇద్దరి మధ్య లాలూచీ ఏంటి.. ? మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి వెదజల్లబోతున్న డబ్బు ఎక్కడినుంచి వస్తోంది..? ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు బాగా అర్థమయ్యాయి. కేవలం తన కాంట్రాక్ట్ పనులకోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని, నియోజకవర్గ ప్రజల్ని అమ్మేశారని, ఇప్పుడు ఆ డబ్బులతోనే ఆయన మళ్లీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తేలిపోయింది. దీంతో ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ఎత్తుగడ వేసింది. ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రిని రంగంలోకి దింపింది.

తాంత్రిక ఆరోపణలు..

కేసీఆర్ ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజలు చేశారంటూ బండి సంజయ్ ఆరోపించారంటే, అతని మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి అర్థం లేని ఆరోపణల్ని, కేంద్ర ఆర్థిక మంత్రి కూడా చేశారంటే ఆ వ్యవహారాన్ని ఎలా చూడాలి..? ఆ ఆరోపణలతో ఆమె తన స్థాయిని దిగజార్చుకున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తూ రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ పనుల బాగోతాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు.

గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇలాంటి స్ట్రాటజీలనే ఉపయోగించింది. బీహార్ ఎన్నికల సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ తాంత్రిక పూజలు చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఆర్జేడీ నేత నితీష్ కూడా తాంత్రిక పూజలు చేశారని గతంలో నరేంద్ర మోదీయే స్వయంగా విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ క్షుద్ర పూజలు చేసిందని కూడా బీజేపీ నేతలు నోరుపారేసుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఒడిశాలో నరేంద్రమోదీ ప్రచారంలో ఉండగా.. సీఎం నవీన్ పట్నాయక్ తాంత్రిక పూజలు చేశారని కూడా ఆరోపించారు. బీజేపీకి ఇదొక అలవాటు, పక్క పార్టీల నేతలు తాంత్రిక పూజలు చేశారని, తాము చూసినట్టే తేదీ, సమయం చెప్పేస్తారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో కూడా ఇలాంటి బ్లేమ్ గేమ్ మొదలు పెట్టాలనుకున్నారు. కానీ పూర్తిగా ఇక్కడ సీన్ రివర్స్ అయింది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎంత కవర్ చేయాలనుకున్నా ఆల్రడీ ఆ విషయం జనాల్లోకి వెళ్లిపోయింది. మునుగోడు ప్రజలు ఆయనపై రగిలిపోతున్నారు. తన స్వలాభం కోసం రాజీనామా చేసి, నియోజకవర్గ అభివృద్ధికోసం అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్న పక్కా వ్యాపారవేత్తను కచ్చితంగా ఓడిస్తామని చెబుతున్నారు.

First Published:  9 Oct 2022 2:20 AM GMT
Next Story