Telugu Global
Telangana

జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవంలో మెరిసిన తెలంగాణ

ప్రస్తుతం నాలుగో జాతీయ జల అవార్డు ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది. ఈ అవార్డుల్లో తెలంగాణ మూడు విభాగాల్లో మెరిసింది.

జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవంలో మెరిసిన తెలంగాణ
X

జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ లో ఘనంగా జరిగింది. తెలంగాణకు ఇందులో మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ నీటి విధానాలను అవలంబించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించినందుకుగాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామం దేశంలోనే ఉత్త‌మ గ్రామ‌పంచాయ‌తీగా ఎంపికైంది. ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ సంస్థల విభాగంలో హైదరాబాద్‌ లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం రెండోస్థానం దక్కించుకొంది. ఈ మూడు పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారులు అందుకున్నారు.


ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ చేతుల మీదుగా.. జ‌గ‌న్నాథ‌పురం గ్రామ స‌ర్పంచ్, పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ క‌లిసి పురస్కారాలు అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తరపున కలెక్టర్ రాహుల్ రాజ్ అవార్డు అందుకున్నారు. ప్రశంసా పత్రం, ట్రోఫీతోపాటు నగదు బహుమతి అందజేశారు నిర్వాహకులు.

జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులను అందజేస్తున్నారు. ప్రస్తుతం నాలుగో జాతీయ జల అవార్డు ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది. ఈ అవార్డుల్లో తెలంగాణ మూడు విభాగాల్లో మెరిసింది. ఇదే రోజు అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ అవార్డులను కూడా తెలంగాణ అందుకోవడం విశేషం. అటు అంతర్జాతీయ స్థాయిలో, ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులతో తెలంగాణ సత్తా చాటుతోంది.

First Published:  17 Jun 2023 2:42 PM GMT
Next Story