Telugu Global
Telangana

మైనంపల్లికి మూడు టికెట్లు కావాలంటా.. ఆ మూడోది ఎవరికంటే..

బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరితో పాటు కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మైనంపల్లికి మూడు టికెట్లు కావాలంటా.. ఆ మూడోది ఎవరికంటే..
X

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయం అయ్యింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరాలని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆయనను కోరారు. దీనిపై మైనంపల్లి హన్మంతరావు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 27లోగా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మైనంపల్లి చెప్పారు. అయితే ఇక్కడే మైనంపల్లి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరితో పాటు కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ టికెట్లు ప్రకటించే రోజు తిరుపతిలో ఉన్న మైనంపల్లి.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ రెండు టికెట్లు ఇవ్వకపోతే పార్టీని వీడతానని హెచ్చరికలు కూడా పంపారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం అవేవీ పట్టించుకోకుండా.. సిట్టింగుల కోటాలో కేవలం మైనంపల్లి హన్మంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి అసమ్మతి రాగం వినిపించిన మైనంపల్లి.. తాజాగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ తనకు మూడు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌ను రెండు టికెట్లు కోరిన మైనంపల్లి.. కాంగ్రెస్‌ను ఏకంగా మూడు టికెట్లు కావాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తనకు మేడ్చెల్ టికెట్, కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్‌తో పాటు మల్కాజిగిరి టికెట్‌ను తన అనుచరుడు నక్కా ప్రభాకర్ గౌడ్‌కు ఇవ్వాలని కోరారు. నక్కా ప్రభాకర్ గౌడ్ తనకు తమ్ముడితో సమానమని.. మల్కాజిగిరి టికెట్ ఇస్తే తప్పకుండా గెలిపించుకుంటారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో చెప్పినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడానికి సర్వేలు చేపడుతున్నదని.. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిని కూడా సర్వేల ఆధారంగానే ఎంపిక చేస్తున్నట్లు మైనంపల్లికి చెప్పినట్లు తెలుస్తున్నది. మైనంపల్లి కోరిన మూడు టికెట్లలో కూడా సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని.. ముందస్తుగా ఎవరికీ హామీ ఇవ్వడం లేదని మైనంపల్లికి తేల్చిచెప్పినట్లు సమాచారం. కాగా మైనంపల్లి ప్రస్తుతం ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు. అక్కడే అధిష్టానం పెద్దలతో ఈ విషయాన్ని చర్చిస్తారని తెలుస్తున్నది.

ఇప్పటికే కుటుంబంలో రెండు టికెట్ల విషయంలో కాంగ్రెస్ చాలా కఠినంగా ఉన్నది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే కుటుంబంలో రెండు టికెట్ల విషయం పరిశీలిస్తామని చెప్పింది. మరి ఇప్పుడే చేరుతున్న మైనంపల్లి విషయంలో ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.

First Published:  25 Sep 2023 8:02 AM GMT
Next Story