Telugu Global
Telangana

తల్లి గుండె తల్లడిల్లి.. - కొడుకు మరణవార్త విని త‌ట్టుకోలేక ఆగిన త‌ల్లి గుండె

తీవ్ర అస్వస్థతతో ఇబ్బందిపడుతున్న అతన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

తల్లి గుండె తల్లడిల్లి.. - కొడుకు మరణవార్త విని త‌ట్టుకోలేక ఆగిన త‌ల్లి గుండె
X

కుమారుడు మృతిచెందాడన్న వార్త ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. ఆ సమాచారం విన్న వెంటనే ఆ మాతృమూర్తి కుప్పకూలిపోయింది. కుమారుడు మృతిచెందిన గంటకే ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. హృదయవిదారకమైన ఈ ఘటన మెదక్‌ జిల్లా హవేలి ఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో శనివారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కుచన్‌పల్లికి చెందిన నర్సింహగౌడ్‌ (36) కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం తెల్లవారుజామున నర్సింహగౌడ్‌ గుండెపోటుకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతతో ఇబ్బందిపడుతున్న అతన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. నర్సింహగౌడ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

కుమారుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న అతని తల్లి లక్ష్మి (57) తల్లడిల్లిపోయింది. తన కొడుకు ఇక లేడనే విషయం తలచుకొని ఆమె విలవిల్లాడిపోయింది. ఉన్నఫళంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో ఆమె చనిపోయిందని వివరించారు. తల్లీకొడుకులిద్దరూ గంట వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

First Published:  6 Jan 2024 3:11 PM GMT
Next Story