Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్ర బిజీనా?

నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. అయితే దీనికి దాదాపు నెలరోజుల ముందు నుండే ప్రచారం, రోడ్డుషోల హీట్ పెరిగిపోయింది. దీంతో అన్నీ పార్టీలు జనాల కోసం సీమాంధ్ర జనాలపైన కన్నేశాయని సమాచారం.

తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్ర బిజీనా?
X

నిజానికి తెలంగాణ ఎన్నికలకు సీమాంధ్రకు ఎలాంటి సంబంధంలేదు. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీ ఎన్నికలకు ఇంకా ఆరు మాసాల సమయముంది. అయినా సరే తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్ర ఫుల్‌ బిజీగా ఉందట. ఎలాగంటే ఎన్నికల ప్రచారంతో.. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. అయితే దీనికి దాదాపు నెలరోజుల ముందు నుండే ప్రచారం, రోడ్డుషోల హీట్ పెరిగిపోయింది. దీంతో అన్నీ పార్టీలు జనాల కోసం సీమాంధ్ర జనాలపైన కన్నేశాయని సమాచారం.

ఇప్పుడు జరుగుతున్న బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీలు ఏది తీసుకున్నా ఎంతమంది జనాలను తరలిస్తే అంత గొప్ప. పార్టీలు భారీసంఖ్యలో జనాలను పోగేసేందుకు బాగా ఆసక్తి చూపుతున్నాయి. అందుకనే జనాలను సమీకరించేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లు కూడా తయారయ్యారట. దీనికోసమే ఈ ఏజెంట్లందరు సీమాంధ్ర జనాల సమీకరణలో చాలా బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు బాగా సన్నిహిత సంబంధాలున్నాయి.

సీమంధ్ర జిల్లాలోని వలస కూలీలు, నిరుద్యోగులు, అడ్డా కూలీలు కొన్నిచోట్ల వ్యవసాయ కూలీలు కూడా తెలంగాణలో జరుగుతున్న బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల్లో పాల్గొంటున్నారట. ఎక్కడికో ఒకచోటకు కూలీ కోసం వెళ్ళక తప్పదని వలస కూలీలు, ఊరికే కూర్చునే కన్నా ఏజెంట్లతో వెళితే డబ్బులు వస్తాయని నిరుద్యోగులు, పొలాల్లో పనిచేసిన దానికన్నా బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొంటే ఇంకా ఎక్కువ డబ్బులు రావటంతో పాటు బిర్యాని, మందు బాటిల్ కూడా దొరకుతుందని వ్యవసాయ కూలీలు తెలంగాణలో కనబడుతున్నారట.

విచిత్రం ఏమిటంటే పార్టీలు వేరైనా దాదాపు ఏజెంట్లు ఒకటిగానే ఉంటారు అలాగే కిరాయికి వచ్చే జనాలు కూడా ఒకటిగానే ఉంటున్నారు. కర్నూలు జిల్లాలోని కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు, శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాల నుండి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్, నాగర్ కర్నూలు, కొల్హాపూర్, అచ్చంపేట ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు హాజరవుతున్నట్లు సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల నుండి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రచారానికి వెళుతున్నారట. ప్రచారంలో పాల్గొనేవాళ్ళకి రోజుకు సుమారు వెయ్యి రూపాయలు అందుతోందట. దీనికి అదనంగా టిపిన్, భోజనం, మందు కూడా ఇస్తున్నారు. అందుకనే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొనేందుకు బాగా ఉత్సాహం చూపుతున్నారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్ర జనాలు బిజీగా ఉంటున్నారని అర్థ‌మవుతోంది.


First Published:  3 Nov 2023 4:30 AM GMT
Next Story