Telugu Global
Telangana

జై తెలంగాణ అంటూ నినదించిన కవిత.. ఈడీ అధికారులతో ఢిల్లీకి

కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని సూచించారు కవిత. రాజకీయ కక్షసాధింపులను, అణిచివేతలను చట్టంపై నమ్మకంతో ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు.

జై తెలంగాణ అంటూ నినదించిన కవిత.. ఈడీ అధికారులతో ఢిల్లీకి
X

అరెస్ట్ అనంతరం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. అక్కడ విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈడీ అధికారులతో ఢిల్లీకి బయలుదేరే ముందు కవిత చాలా ప్రశాంతంగా కనిపించారు. ఇంటి బయటకు వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలకు అభివాదం చేశారు. జై తెలంగాణ అంటూ నినదించారు. కారులో వెళ్లే సమయంలో కూడా ఆమె గంభీరంగానే కనిపించారు. ఆమె వెంట కేటీఆర్ ఉన్నారు.


కవిత ఇంటి ముందు ఉద్రిక్తత..

మధ్యాహ్నం ఈడీ అధికారులు సోదాలకు వచ్చిన తర్వాత కవిత ఇంటి ముందు సందడి మొదలైంది. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చాయి. కవిత అరెస్ట్ ప్రకటన తర్వాత కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర కీలక నేతలు అక్కడకు చేరుకున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీమ్ కూడా ఈడీ అధికారులను సంప్రదించింది. అరెస్ట్ విషయంలో ఈడీ వెనక్కు తగ్గలేదు. అరెస్ట్ వారెంట్ ఇచ్చి కవితను తమతో ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టు తేల్చి చెప్పారు. దీంతో ఆమె ఢిల్లీకి బయలుదేరారు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని సూచించారు కవిత. రాజకీయ కక్షసాధింపులను, అణిచివేతలను చట్టంపై నమ్మకంతో ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు.


ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన వేళ, ఎమ్మెల్సీ కవితను కావాలనే అరెస్ట్ చేయించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కవిత అరెస్ట్ ను నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ కక్షసాధింపు అని మండిపడ్డారు. పలువురు నేతలు కవితకు సంఘీభావంగా తమ సందేశాలను సోషల్ మీడియాలో ఉంచారు.

First Published:  15 March 2024 2:22 PM GMT
Next Story