Telugu Global
Telangana

ఇలాంటి ప్రధాని మనకు అవసరమా..?

రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై గంటన్నర సేపు మాట్లాడిన మోదీ, ఒక్కసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు కవిత. ఇలాంటి ప్రధాని మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇలాంటి ప్రధాని మనకు అవసరమా..?
X

పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా..? అంటూ సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. అదానీ సంస్థల కారణంగా LIC, SBI వంటి ప్రభుత్వరంగ సంస్థలు ‌నష్టపోతున్నా, మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.


అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని ఆమె మరోసారి డిమాండ్ చేశారు. ఈ విచారణకోసమే రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బహిష్కరించారని, మోదీ ప్రసంగ సమయంలో వాకౌట్ చేయడంతో పాటు పార్లమెంటులో ప్రతి రోజు నిరసన తెలిపారని పేర్కొన్నారు.


రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై గంటన్నర సేపు మాట్లాడిన మోదీ, ఒక్కసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు కవిత. ఇలాంటి ప్రధాని మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మోదీకి ప్రజలపై పట్టింపు లేదని, తన‌ మిత్రులైన పారిశ్రామిక వేత్తలపైనే ఎక్కువ పట్టింపు ఉందనే విషయం.. ఆయన ఈరోజు చేసిన ప్రసంగంతో తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు.

హిండెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో రెండో స్థానం నుంచి 22వ స్థానానికి పడిపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ సంస్థ ల నుండి అప్పులు తీసుకుందని, అదానీ గ్రూప్ లో LIC సంస్థ రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు.


SBI నుండి రూ. 27 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.7 వేల కోట్లు, ఇలా ఏడు జాతీయ బ్యాంకులనుంచి అదానీ అప్పులు తీసుకున్నారని, ఇప్పుడు అవి మొండి బకాయిల్లా మారిపోయాయని చెప్పారు.


హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51శాతం పడిపోగా, LIC రూ.18 వేల కోట్లు నష్టపోయిందని చెప్పారు. చిరుద్యోగులు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు LIC షేర్లు కొని, అదానీ సంస్థ కారణంగా తీవ్రంగా నష్టపోయారని కవిత పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కాపీకొట్టి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు కవిత. తొలి ఏడాది ఈ పథకం ద్వారా 11.84 కోట్ల రైతులకు లబ్ధి చేకూరిందని, రెండో ఏడాది వారి సంఖ్య 9.3 కోట్లకు పడిపోయిందని, ఆ తర్వాతి ఏడాది 9కోట్లు, మరుసటి ఏడాది కేవలం ఏడున్నర కోట్లమందికి మాత్రమే పీఎం కిసాన్ నిధులు అందాయని చెప్పారు.


ఏడాదికేడాది లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్న కేంద్రం, అన్నదాతలను దారుణంగా మోసం చేస్తోందన్నారు. జగిత్యాల జిల్లా నుండి అకారణంగా 50 వేల మంది రైతులను, నిజామాబాద్ నుంచి 60 వేల మంది రైతులను పీఎం కిసాన్ పథకం నుండి తొలగించారని ఆరోపించారు. కానీ ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం అమలు చేశామని నిండు సభలో కేంద్రం అబద్ధం చెప్పిందని కవిత విమర్శించారు.



First Published:  8 Feb 2023 3:58 PM GMT
Next Story