Telugu Global
Telangana

ఢిల్లీ వయా బెంగళూరు.. రేవంత్ పై కవిత పంచ్

అప్పట్లో ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేవారని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని కాకపోతే వయా బెంగళూరు ఈ రాజకీయాలు నడుస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు విసిరారు కవిత.

ఢిల్లీ వయా బెంగళూరు.. రేవంత్ పై కవిత పంచ్
X

తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానం చేతిలో కీలుబొమ్మలంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంటుంది. బీజేపీ పరిస్థితి కూడా దాదాపుగా అదే. అయితే కాంగ్రెస్ విషయంలో కుమ్ములాటలు, అంతర్గత కలహాలు మరీ ఎక్కువగా బయటకు కనపడుతుంటాయి. ఆ పేచీలను తీర్చుకోడానికి కూడా వారు ఢిల్లీ గుమ్మం తొక్కాల్సిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడుతున్నారంటూ మరోసారి మండిపడ్డారు.


ఢిల్లీ వయా బెంగళూరు..

అప్పట్లో ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేవారని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని కాకపోతే వయా బెంగళూరు ఈ రాజకీయాలు నడుస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు విసిరారు కవిత. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలసి ఉన్న ఫొటోను ఆమె తన ట్వీట్ కి జతచేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం అంటూ సెటైర్లు పేల్చారు.

తెలంగాణపై డీకే ముద్ర..

ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ పై డీకే శివకుమార్ ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ ని అధికారంలోకి తేవడానికి డీకే తీవ్రంగా కృషి చేసి ఫలితం సాధించారు. ఆయన మార్కు రాజకీయం ఇప్పుడు తెలంగాణలో కూడా చూపెట్టాలనుకుంటున్నారు. ముందుగా షర్మిల-కాంగ్రెస్ మధ్య డీల్ కుదిర్చారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ తో మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో డీకే-రేవంత్ భేటీపై కవిత సెటైర్లు వేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మోకరిల్లడం మాత్రం మరచిపోలేదని, కానీ ఇప్పుడు ఆ వ్యవహారం అంతా వయా బెంగళూరు జరుగుతోందన్నారు.

First Published:  2 Sep 2023 7:27 AM GMT
Next Story