Telugu Global
Telangana

గవర్నర్ మాటల్లోనే కేంద్రానికి కవిత కౌంటర్లు..

గవర్నర్ తెలంగాణ సచివాలయాన్ని టార్గెట్ చేయాలనుకుంటే, ఆమె వ్యాఖ్యలతో పార్లమెంట్ కొత్త ప్రాంగణాలైన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ని టార్గెట్ చేశారు కవిత. గవర్నర్ వ్యాఖ్యలతో కేంద్రాన్ని ఇరుకున పెట్టారు.

గవర్నర్ మాటల్లోనే కేంద్రానికి కవిత కౌంటర్లు..
X

తెలంగాణ రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆమె రాజకీయ విమర్శలు చేశారు. కొత్త భవనాలు మాత్రమే అభివృద్ధి కాదంటూ పరోక్షంగా సచివాలయ నిర్మాణాన్ని ఆమె దెప్పిపొడిచారు. రైతులు, పేదలందరికీ.. భూములు, ఇళ్లు కావాలని అన్నారు. కేవలం కొత్త భవనాలు కడితే ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చిన ఆమె, రాష్ట్ర అభ్యుదయంలో తనవంతు పాత్ర పోషిస్తానన్నారు. ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని చెప్పారు తమిళిసై. కొంతమందికి తాను నచ్చకపోవచ్చని, కానీ తనకు తెలంగాణ వాళ్లంటే ఇష్టమని, అందుకే ఎంత కష్టమైనా తాను తెలంగాణ కోసం పనిచేస్తానన్ననారు.

గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. రిపబ్లిక్ డే రోజున ఆమె, తెలంగాణ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాత్రం సుతి మెత్తగా గవర్నర్ వ్యాఖ్యలపై కౌంటర్లు ఇచ్చారు. గవర్నర్ వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ విజన్ ని ప్రతిబింబించేలా ఉన్నాయన్నారు. గవర్నర్‌ కు ధన్యవాదాలు అంటూ కవిత ట్వీట్‌ చేశారు.


‘‘సీఎం కేసీఆర్‌ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌ కు థ్యాంక్స్‌. దేశంలోని మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే డిమాండ్‌ చేశాం. కరోనా క్లిష్ట సమయంలో సెంట్రల్‌ విస్టా కంటే మౌలిక సదుపాయాలు ముఖ్యమని చెప్పాం. కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టొద్దని.. రైతులు, కూలీలు, నిరుద్యోగులను పట్టించుకోవాలని పోరాడాం’’ అంటూ కవిత ట్వీట్‌ చేశారు. దేశంలో భిన్నత్వాన్ని రాజ్యాంగం ప్రతిబింబిస్తోందని మరో ట్వీట్‌ లో కవిత పేర్కొన్నారు.

గవర్నర్ తెలంగాణ సచివాలయాన్ని టార్గెట్ చేయాలనుకుంటే, ఆమె వ్యాఖ్యలతో పార్లమెంట్ కొత్త ప్రాంగణాలైన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ని టార్గెట్ చేశారు కవిత. గవర్నర్ వ్యాఖ్యలతో కేంద్రాన్ని ఇరుకున పెట్టారు. దేశంలో పేదలు కరోనా కష్టాల్లో ఉన్నప్పుడు, మధ్యతరగతి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నప్పుడు కేంద్రం పట్టించుకోలేదని, సెంట్రల్ విస్టా పనులు చూసుకోవడంలో మునిగిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు.

First Published:  26 Jan 2023 11:40 AM GMT
Next Story