Telugu Global
Telangana

ఫేక్ చాట్ తో దుష్ప్రచారం.. మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత

ఇటీవల తన మొబైల్ ఫోన్ల విషయంలో కూడా తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారన్నారు కవిత. మళ్లీ ఇప్పుడు సుఖేష్ ను పావుగా వాడుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

ఫేక్ చాట్ తో దుష్ప్రచారం.. మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
X

తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడతాం..! అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సుఖేష్ అనే వ్యక్తితో తనకు ఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీపై, మరీ ముఖ్యంగా తనపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు కవిత. బీఆర్ఎస్ ప్రజాదరణను, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారామె.

తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పెట్లో పెట్టుకొని పేపర్లు, టీవి ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బీఆర్ఎస్ పై బురదజల్లేందుకు సిద్ధమయ్యారని చెప్పారు కవిత. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేస్తే.. దాన్ని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం హాస్యాస్పదం అన్నారు. ఆ తర్వాత ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్ లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని అమలులో పెట్టారని దుయ్యబట్టారు.


సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం లేదని, అతనెవరో కూడా తనకు తెలియదన్నారు కవిత. వాస్తవాలను పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయన్నారు. ఇటీవల తన మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారన్నారు కవిత. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

కొన్ని మీడియా సంస్థల పనితీరు అత్యంత దురదృష్టకరంగా ఉందని విమర్శించారు కవిత. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం అన్నారు. రాజకీయ అజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం దారుణం అన్నారు. ఎన్నికల ఏడాదిలో మరింతగా దిగజారిపోతారని, తెలంగాణ సమాజం గ్రహించి జాగ్రత్త పడాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజలు విజ్ఞులని, పాలు-నీళ్లకు ఉన్న తేడా తెలిసిన చైతన్య జీవులని చెప్పారు కవిత. తెలంగాణను దేశంలోనే ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్ష్యతో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. తనపై తప్పుడు వార్తలు రాయడానికి ఇచ్చే అగ్ర ప్రాధాన్యత.. దమ్ముంటే, నిజాయితీ ఉంటే తన వివరణకి కూడా ఇవ్వాలన్నారు.

First Published:  13 April 2023 10:57 AM GMT
Next Story