Telugu Global
Telangana

మిస్టర్ ఎలక్షన్ గాంధీ..! కవిత సంచలన వ్యాఖ్యలు

భారత్ జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ పీఆర్ కోసం దేశం చుట్టి వచ్చారని, కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఆయన మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ కవిత.

మిస్టర్ ఎలక్షన్ గాంధీ..! కవిత సంచలన వ్యాఖ్యలు
X

సనాతన ధర్మం గురించి ఇటీవల డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. డీఎంకే ఎంపీ గోమూత్ర రాష్ట్రాలంటూ బీజేపీ పాలిత రాష్ట్రాలను కామెంట్ చేయడం కూడా సంచలనంగా మారింది. తాజాగా డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలు కూడా ఇలాగే సంచలనంగా మారాయి. హిందీ మాట్లాడేవారు బాత్రూమ్ లు కడిగేందుకు తమిళనాడుకు వస్తారని అన్నారాయన. ఈ ఉదాహరణలు ప్రస్తావిస్తూ రాహుల్ గాందీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. 'ఇండియా' కూటమి ప్రతినిధిగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలపై కచ్చితంగా స్పందించాలన్నారు.


ఎలక్షన్ గాంధీ..

రాహుల్ గాంధీని తాను ఎలక్షన్ గాంధీగానే సంబోధిస్తానని, ఎందుకంటే ఆయన ఎన్నికల టైమ్ లోనే బయటకొస్తారని ఎద్దేవా చేశారు కవిత. ఇప్పుడు ఎన్నికల సీజన్ ఉంది కదా, కనీసం ఇప్పుడైనా ఈ వ్యాఖ్యలపై స్పందించండి అంటూ కౌంటర్ ఇచ్చారు. కొంతమంది నాయకులు తమ 2 నిమిషాల కీర్తి కోసం మతపరమైన మనోభావాలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దాడిని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సనాతన ధర్మం విషయంలో రాహుల్ గాంధీ తన స్టాండ్ ఏంటో చెప్పాలని నిలదీశారు.

భారత్ జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ పీఆర్ కోసం దేశం చుట్టి వచ్చారని, కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఆయన మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. హిజాబ్‌ వివాదంపై కూడా రాహుల్‌ తన మౌనం వీడి.. తన వైఖరిని వెల్లడించాలన్నారు. కాంగ్రెస్‌ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని చెప్పారు. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తామని, ఆలోగా హామీలు, గ్యారంటీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు కవిత.

First Published:  25 Dec 2023 9:57 AM GMT
Next Story