Telugu Global
Telangana

అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్నాం -కవిత

అమ్మ లాంటి సింగరేణి సంస్థను సీఎం కేసీఆర్ కాపాడి, విస్తరించడం, వేలాది మందికి అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో సంస్థ లాభాల బాట పట్టిందన్నారు కవిత.

అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్నాం -కవిత
X

అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం సీఎం కేసీఆర్ కి మాత్రమే దక్కుతుందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే సింగరేణి కార్మికులు గొప్ప ఫలితాలు అందుకుంటున్నారని చెప్పారు. గతంలో వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా అనేక మంది ప్రయత్నాలు చేసినా, సీఎం కేసీఆర్ పట్టుదలతో వారసత్వ ఉద్యోగాలు అందిస్తున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్లతో పాటు, చిరకాల వాంఛ అయిన డిపెండెంట్ ఉద్యోగాలు సైతం సాధించుకున్నామని తెలిపారు. కారుణ్య నియామ ప్రక్రియ ద్వారా ప్రతినెలా ఉద్యోగులను తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వారసత్వ ఉద్యోగాలు కేవలం పురుషులకే కాకుండా, కూతుళ్లు, కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం మహిళల పట్ల కేసీఆర్ కు ఉన్న గొప్ప మనసును తెలియజేస్తోందన్నారు కవిత.

కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న రూ.10 లక్షలను , తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ.25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఉద్యోగ విరమణ వయస్సుని 61 సంవత్సరాలకు పెంచామని చెప్పారు. సింగరేణి కార్మికుల క్వార్టర్స్ కు ఉచిత విద్యుత్ తో పాటు అనేక ఇతర సౌకర్యాలు కల్పించామని, ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్, మెడికల్ కాలేజీ సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు.

అమ్మ లాంటి సింగరేణి సంస్థను సీఎం కేసీఆర్ కాపాడి, విస్తరించడం, వేలాది మందికి అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో సంస్థ లాభాల బాట పట్టిందన్నారు కవిత. తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల, తెలంగాణ బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే ఈ అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు.

First Published:  5 Jun 2023 8:50 AM GMT
Next Story