Telugu Global
Telangana

ఆ స్టాండప్ కమెడియన్ హైదరాబాద్ వస్తే..... రాజాసింగ్ హెచ్చరికలు

కామెడీని కూడా భరించలేకపోతున్నారు బీజేపీ నాయకులు. ఈ నెల 20 న హైదరాబాద్ కు ఓ షో నిమిత్తం రానున్న స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కి హెచ్చరికలు జారీచేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

ఆ స్టాండప్ కమెడియన్ హైదరాబాద్ వస్తే..... రాజాసింగ్ హెచ్చరికలు
X

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ ఈ నెల‌ 20న హైదరాబాద్ వస్తున్నారు. ఆ రోజు హైదరాబాద్ లో ఆయన షో ఉంది. గతంలో కూడా ఆయన హైదరాబాద్ రావాల్సి ఉండగా బీజేపీ నేతలు ఆయనను బెదిరించారు. ఆ సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయనను ఆహ్వానిస్తూ భద్రత కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు.

అయితే మునావర్ వస్తే తన యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. మునావర్ పై మండిపడిన రాజాసింగ్ 20న ఆయన షో జరిగితే 22న తన షో మొదలవుతుందని హెచ్చరించారు. మునావర్ గతంలో సీతారాములు గురించి నీచంగా మాట్లాడాడని, అలాంటి మనిషిని కొంత మంది పిలిచి పోలీసు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజా సింగ్.

మునావర్ గనక హైదరాబాద్ లో అడుగుపెడితే అప్పుడు తానేంటో చూపిస్తానని రాజాసింగ్ హెచ్చరించారు. మునావర్ నమ్మే దేవుడిపై తాను కూడా కామెంట్లు చేస్తానని చెప్పిన రాజా సింగ్, మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను రిపీట్ చేశారు. నుపుర్ శర్మ చేసిన చిన్న కామెంట్ తో దేశం మొత్తం సమస్య సృష్టించారని నేనూ అవే కామెంట్లు చేస్తానని రాజాసింగ్ అన్నారు. అలా జరగకూడదనుకుంటే మునావర్ ను రాకుండా పోలీసులు అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజా సింగ్ చేసిన ఈ హెచ్చరికల పట్ల సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బీజేపీ సోషల్ మీడియా వింగ్ ద్వారా తమ వ్యతిరేకులను ట్రోలింగ్ కు గురి చేస్తూ, ప్రతి ఒక్కరిపై విమర్షలు, ఆరోపణలు, దుష్ప్రచారం చేసే బీజేపీ నాయకులు ఇతరులు తమపై చేసే విమర్శ‌లను మాత్రం తట్టుకోలేకపోవడం పట్ల సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రతి ఒక్కరినీ మాట్లాడ కుండా చేస్తూ దేశం గొంతు నొకేస్తున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. కామెడీని కూడా భరించలేక పోవడం బీజేపీ నాయకుల నిరంకుశత్వానికి పరాకాష్ట అని నెటిజనులు విమర్శిస్తున్నారు.

First Published:  15 Aug 2022 3:41 AM GMT
Next Story