Telugu Global
Telangana

సింగరేణిలో అన్ని చోట్లా బీఆర్ఎస్ గెలిచి తీరాలి

సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు కవిత. ఆ విషయంలో తానే చొరవ తీసుకొని సీఎం కేసీఆర్‌ తో చర్చిస్తానన్నారు.

సింగరేణిలో అన్ని చోట్లా బీఆర్ఎస్ గెలిచి తీరాలి
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణిలోని అన్ని ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి ప్రాంతంలో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్‌ కు కానుకగా ఇవ్వాలని ఆ ప్రాంత ఉద్యోగుల్ని కోరారు. సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్‌, నాన్ టీచింగ్ స్టాఫ్ ఈరోజు ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లో కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి ఆమె సాయం అభ్యర్థించారు. వారి సమస్యలు పరిష్కారానికి హామీ ఇచ్చిన కవిత.. సింగరేణి సంస్థకు కేసీఆర్ చేసిన సాయాన్ని గుర్తు చేశారు.

సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ తప్పించారని, ఆ సంస్థను కాపాడారని అన్నారు కవిత. ఆర్టీసీ ఉద్యోగుల్ని కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత కేసీఆర్‌ కే దక్కుతుందని తెలిపారు. ఉద్యోగుల విషయంలో వారి సమస్యలను ఒక్కొక్కటే పరిష్కరిస్తూ వస్తున్న కేసీఆర్ మానవతా దృక్పథంతో వారికి అండగా నిలుస్తున్నారని చెప్పారు.

సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు కవిత. ఆ విషయంలో తానే చొరవ తీసుకొని సీఎం కేసీఆర్‌ తో చర్చిస్తానన్నారు. సింగరేణి కార్మిక నాయకులు సీఎంతో సమావేశం అయ్యేలా ఏర్పాటు చేస్తానన్నారు, వారికి భరోసా ఇచ్చారు.

First Published:  3 Sep 2023 11:46 AM GMT
Next Story