Telugu Global
Telangana

మిషన్ కాకతీయకు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు..

భూగర్భ జలాల వాడకం 100 శాతానికి మించితే అక్కడ ప్రమాద ఘంటికలు మోగినట్టే లెక్క. తెలంగాణకు ఆ ప్రమాదం అస్సలు లేదు. అన్ని జిల్లాల సగటు లెక్కలు తీస్తే.. తెలంగాణ సేఫ్ జోన్ లో ఉంది.

మిషన్ కాకతీయకు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు..
X

భూగర్భ జలాలను మెరుగుపరచడంలో.. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో మిషన్ కాకతీయ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఇన్ స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్ నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపేరిటివ్ సంస్థ తాయరు చేసిన సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్(SPI)లో తెలంగాణ జిల్లాలు సురక్షితమైనవిగా గుర్తించారు. దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లో భూగర్భ జలాల వినియోగంపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. అవసరానికి మించి నీటిని వాడుతోంది ఎవరు, అవసరానికి తగ్గట్టుగా ఉపయోగిస్తోంది ఎవరు, అంతకంటే తక్కువగా నీటిని పొదుపుగా వినియోగిస్తోంది ఎవరు అనే లిస్ట్ తయారు చేసింది. ఇందులో తెలంగాణలోని 23 జిల్లాలు సురక్షితమైన లిస్ట్ లో ఉన్నాయి.

మిషన్ కాకతీయ గొప్పతనమే..

మిషన్ కాకతీయ వల్ల ప్రభావితం అయ్యే జిల్లాల్లో భూగర్భ జలవనరుల వాడకం బాగా తగ్గింది. ప్రజలు నీటి వనరుల నిర్వహణలో చురుగ్గా పాల్గొంటున్నారు. గ్రామస్తులు, రైతుల సహకారంతో మిషన్ కాకతీయ విజయవంతమైంది. భూగర్భ జలాల వాడకం తగ్గడంతో అదే స్థాయిలో నీటి మట్టాలు కూడా పెరిగాయి. ఇదంతా మిషన్ కాకతీయ మహిమేనని తెలుస్తోంది. ఆమధ్య కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్‌ మెంట్ రిపోర్ట్- 2022 ప్రకారం, తెలంగాణలో వార్షిక భూగర్భ జలాల రీఛార్జ్ 16.63 నుండి 21.11 బిలియన్ క్యూబిక్ మీటర్లకు (BCM) పెరిగింది. 2020తో పోలిస్తే భూగర్భ జలాల మట్టం దాదాపు 4.4 మీటర్లు పెరిగింది.

మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే..?

భూగర్భ జలాల వాడకం 100 శాతానికి మించితే అక్కడ ప్రమాద ఘంటికలు మోగినట్టే లెక్క. తెలంగాణకు ఆ ప్రమాదం అస్సలు లేదు. అన్ని జిల్లాల సగటు లెక్కలు తీస్తే.. తెలంగాణ సేఫ్ జోన్ లో ఉంది. హర్యానా (134.56 శాతం), రాజస్థాన్ (150.22 శాతం), పంజాబ్ (164.42 శాతం), ఢిల్లీ (101.40 శాతం) ఇలా పరిమితికి మించి భూగర్భ జలాలను తోడేస్తున్నాయి. జిల్లాల వారీగా లెక్క తీస్తే దేశంలో 17 జిల్లాల్లో 200 శాతం కంటే ఎక్కువ నీటిని బయటకు తీస్తున్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్, జోథ్ పూర్, పంజాబ్ లోని సంగ్రూర్, జలంధర్ లో నీటి వినియోగం భారీగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ (0.36 శాతం), సిక్కిం (0.86 శాతం), నాగాలాండ్ (1.04 శాతం) తో అత్యంత సురక్షితమైన లిస్ట్ లో ఉన్నాయి.

First Published:  12 Jan 2023 2:06 AM GMT
Next Story