Telugu Global
Telangana

ఇసుక అక్రమ రవాణా.. మంత్రి సీతక్క పీఏపై వేటు..!

పట్టుబడిన లారీలపై సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. లారీలు పట్టుబడిన వెంటనే సీఎం రేవంత్ బొమ్మ ఉన్న అద్దాలను డ్రైవర్లు పగలగొట్టడం అనుమానాలకు దారి తీసింది.

ఇసుక అక్రమ రవాణా.. మంత్రి సీతక్క పీఏపై వేటు..!
X

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని సీఎం రేవంత్ ఓ వైపు ప్రకటన చేస్తుంటే.. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న 17 లారీలు పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశమైంది. పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అయితే పట్టుబడిన లారీలపై సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. లారీలు పట్టుబడిన వెంటనే సీఎం రేవంత్ బొమ్మ ఉన్న అద్దాలను డ్రైవర్లు పగలగొట్టడం అనుమానాలకు దారి తీసింది. సలార్ సినిమా రేంజ్‌లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని చర్చ జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా వెనుక రేవంత్‌ సర్కార్‌లోని ఇద్దరు మంత్రుల పీఏల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరు మంత్రుల పీఏలను సస్పెండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకరు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పీఏ కాగా.. మరొకరు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సీతక్క పీఏ సుజిత్‌ రెడ్డి అని సమాచారం.

భద్రాచలం సమీపంలోని సారపాక దగ్గర ఇసుక అక్రమంగా తరలిస్తున్న 17 లారీలను గురువారం మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. అయితే లారీలను పట్టుకున్న విషయం తెలిసి ఇద్దరు మంత్రుల పీఏల నుంచి అధికారులకు పదేపదే ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది. లారీలను సీజ్‌ చేసిన అధికారులు.. ఒక్క లారీ డ్రైవర్‌ను పట్టుకోకపోవడం గమనార్హం.

First Published:  17 Feb 2024 5:22 AM GMT
Next Story