Telugu Global
Telangana

రఘునందన్ ని మళ్లీ లేవకుండా కొట్టాలి..

అమిత్ షా దగ్గరకు పోతా, కూర్చుంటా, ఏకుతా, పీకుతా.. అని చాలా కోతలు కోశాడని ఎమ్మెల్యే రఘునందన్ రావుపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఆయనకు మరోసారి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

రఘునందన్ ని మళ్లీ లేవకుండా కొట్టాలి..
X

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కత్తిపోటుకి గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకుని తిరిగి ప్రచారంలోకి వచ్చారు. ఆయనకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ఈరోజు దుబ్బాకలో ప్రచారం చేపట్టారు. కత్తిపోటుకు ఓటుపోటుతో సమాధానం చెప్పాలని కోరారు. ఈసారి దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు కేటీఆర్.


బఫూన్, జోకర్, లుచ్చా..

దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓ బఫూన్, జోకర్, లుచ్చా అని దుయ్యబట్టారు. ఉప ఎన్నికల్లో దొంగమాటలు చెప్పి వెయ్యి ఓట్లతో బయటపడిన రఘునందన్ రావు.. ఎన్ని అబద్ధపు హామీలిచ్చారో చూడండి అంటూ ఆ లిస్ట్ చదివారు కేటీఆర్. ఉప ఎన్నికల్లో ఆయనిచ్చిన హామీలన్నీ నెరవేర్చారా లేదా అని ప్రజల్ని అడిగారు. వ్యక్తిగతంగా పెన్షన్లు ఇస్తానని ఇవ్వలేదని, ఉచిత ఎరువులు ఇవ్వలేదని, ఉచిత కార్పొరేట్ పాఠశాలలు పెడతానని హామీ ఇచ్చి చివరకు ఉత్తచేతులు చూపించారని మండిపడ్డారు. రఘునందన్ రావుని ఈసారి మళ్లీ లేవకుండా ఎన్నికల్లో ఓడగొట్టాలని సూచించారు మంత్రి కేటీఆర్.

అమిత్ షా దగ్గరకు పోతా, కూర్చుంటా, ఏకుతా, పీకుతా.. అని చాలా కోతలు కోశాడని ఎమ్మెల్యే రఘునందన్ రావుపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఆయనకు మరోసారి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఓటర్లను డబ్బులతో కొనాలనుకుంటున్నారని, వారి ప్రలోభాలకు లొంగిపోవద్దన్నారు. మనమందరం ఒకటే తెలంగాణను ఢిల్లీ గద్దలనుంచి కాపాడుకోవాలన్నారు కేటీఆర్. షేర్లు, షంషేర్లు, బబ్బర్ ఖాన్ లు, తీస్మార్ ఖాన్ లు అందరూ.. ఢిల్లీనుంచి వస్తున్నారని కానీ కేసీఆర్ సింహం లాంటివారని సింగిల్ గానే వస్తారని చెప్పారు.

First Published:  21 Nov 2023 1:21 PM GMT
Next Story