Telugu Global
Telangana

నిజాం కాలేజీ స్టూడెంట్‌ అయినందుకు గర్వపడుతున్నా.. - కేటీఆర్

నిజాం కాలేజీకి గొప్ప పేరు ఉందని, తాను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నిజాం కాలేజీలో చదువుకున్న విషయాన్ని గర్వంగా చెబుతానన్నారు.

నిజాం కాలేజీ స్టూడెంట్‌ అయినందుకు గర్వపడుతున్నా.. - కేటీఆర్
X

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. నిజాం కాలేజీ బాలుర హాస్టల్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. దాదాపు రూ.18.75 కోట్లతో హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ నిజాం కాలేజీలో తన స్టూడెంట్ లైఫ్‌ను గుర్తు చేసుకున్నారు. 1993-96 వరకు నిజాం కాలేజీలోనే చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి తన విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు.

నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వపడతానని కేటీఆర్‌ అన్నారు. నిజాం కాలేజీకి గొప్ప పేరు ఉందని, తాను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నిజాం కాలేజీలో చదువుకున్న విషయాన్ని గర్వంగా చెబుతానన్నారు. ఈరోజు రాష్ట్ర యూనివర్సిటీలలో ఉస్మానియా నాల్గ‌వ అత్యుత్తమ స్థానాన్ని సాధించడం సంతోషకరమని తెలిపారు. వీసీ రవీందర్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు చెప్పారు. ఉస్మానియా అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుంది అని కొనియాడారు.

తెలంగాణ TSATతో ఉస్మానియా టీవీ ఏర్పాటు చేయడం ద్వారా మారుతున్న పరిస్థితులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విద్యను ఎక్కువ మందికి చేరేలా ప్రయత్నాలు చేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిజాం కాలేజీ స్టూడెంట్ అయి కూడా కాలేజీ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గతంలో డిగ్రీ బాలికల కోసం హాస్టల్ వసతి లేనప్పుడు వెంటనే స్పందించి హాస్టల్ నిర్మాణం చేసి, ప్రారంభించుకున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

విద్యాశాఖ నిధులకు అదనంగా పురపాలక శాఖలోని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 40 కోట్ల 75 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అని వెల్లడించారు. ఈరోజు బాయ్స్ హాస్టల్ తో పాటు అదనపు తరగతి గదులు పదింటిని నిర్మాణం చేసుకోబోతున్నామని, 15 నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలిపారు. నిజాం కాలేజ్ గ్రౌండ్ కు ఇబ్బంది రాకుండా ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఉద్యమ కాలంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థులు, అధ్యాపకుల పట్ల త‌మ‌కు ప్రత్యేక గౌరవం ఉంది అని, వారి కోసం ఎంత అవసరమైతే అంత సహాయం చేస్తామని అన్నారు మంత్రి కేటీఆర్.

నిజాం కాలేజీ విద్యార్థుల పట్ల ప్రత్యేక ప్రేమ చూపిస్తున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు విద్యాశాఖ తరఫున మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎంతోమంది నిజాం కాలేజీలో చదువుకున్నప్పటికీ మంత్రి కేటీఆర్ మాత్రం కాలేజీ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు.

First Published:  12 Aug 2023 2:26 PM GMT
Next Story