Telugu Global
Telangana

ఇంకెన్ని అబద్దాలు చెబుతారు సార్.. జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్ సెటైర్లు

ఒక అబద్దాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందనే గోబెల్ సూత్రాన్ని బీజేపీ సరిగ్గా వంట పట్టించుకున్నది.

ఇంకెన్ని అబద్దాలు చెబుతారు సార్.. జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
X

ప్రధాని మోడీ చేయని పనులను కూడా చేసినట్లు చెప్పుకోవడం బీజేపీకి మొదటి నుంచి అలవాటే. పొద్దున లేస్తే బీజేపీ సోషల్ మీడియా ఒక్కో రకం ప్రచారంతో సందేశాలు పంపుతుంటుంది. అవన్నీ అబద్దాలే అని సగటు భారతీయుడికి తెలుసు. కానీ ఒక అబద్దాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందనే గోబెల్ సూత్రాన్ని బీజేపీ సరిగ్గా వంట పట్టించుకున్నది. ఇలాంటి అబద్దపు ప్రచారాలపై ప్రతిపక్షాలు ఎన్ని సార్లు విమర్శలు చేసినా.. తమ ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. కేవలం బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలే కాదు.. ఆ పార్టీ అగ్రనేతల వైఖరి కూడా అలాగే ఉంటుంది.

తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. 22,500 మంది భారత విద్యార్థులను రక్షించడానికి ప్రధాని మోడీ రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపారని నడ్డా చెప్పుకొచ్చారు. గతంలోనే ఇలాంటి అబద్దపు ప్రచారం చేసి అభాసుపాలైనా.. నడ్డా తిరిగి దాన్నే వల్లెవేశారు. జేపీ నడ్డా కర్నాటకలోని ఉడిపిలో జరిగిన కార్యక్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

'కర్నాటక, మహరాష్ట్ర మధ్య ఉన్న సరిహద్దు తగాదానే మోడీ తీర్చలేకపోతున్నారు. అవి రెండూ బీజేపీ పాలనలోనే ఉన్నా.. మోడీకే ఆ సమస్యను తీర్చడం చేతకావడం లేదు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం ప్రధాని మోడీ రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపారంటూ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారు. మీ సొంత కేబినెట్ మంత్రే ఇది తప్పని చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ విద్యార్థులను తీసుకొని రావడానికి సహాయం చేసింది ఫ్రాన్స్ అని కూడా చెప్పారు. మళ్లీ మీ అబద్దపు ప్రచారం ఏంటి? ఇంకెన్ని అబద్దాలు చెప్తారు సార్' అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.


First Published:  21 Feb 2023 5:11 AM GMT
Next Story