Telugu Global
Telangana

అత్యుత్తమ కంపెనీల గమ్యస్థానం తెలంగాణ.. డిప్లొమాట్ ఔట్ రీచ్ లో కేటీఆర్

తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాల‌పై ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన స్వయంగా వివరించారు.

అత్యుత్తమ కంపెనీల గమ్యస్థానం తెలంగాణ.. డిప్లొమాట్ ఔట్ రీచ్ లో కేటీఆర్
X

ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన పలు కంపెనీలకు గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ గమ్యస్థానంగా మారిందని చెప్పారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలోని స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ పాలసీలతో పాటు దేశంలోనే అత్యుత్తమ ఈకో సిస్టం కారణంగా ఆయా కంపెనీలన్నీ ఇక్కడ విజయవంతంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. హైదరాబాద్ టీ-హబ్ 2.0 లో జరిగిన డిప్లొమాట్ ఔట్‌ రీచ్ ప్రోగ్రామ్ లో కేటీఆర్ సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సుల్ జనరల్స్, హై కమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహంచారు.

తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాల‌పై ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన స్వయంగా వివరించారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో గత ఎనిమిదేళ్లుగా నమోదైన ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ది చెందిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ప్రోత్సాహకాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోని ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలు తెలంగాణ అని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నాయని గుర్తు చేశారు.

వ‌ర్చువ‌ల్ మ‌స్క‌ట్‌, చాట్‌ బొట్‌ ఆవిష్క‌రణ..

తెలంగాణ పెట్టుబడుల సలహాదారు పేరుతో రూపొందించిన వర్చువల్ మస్కట్, చాట్‌ బొట్‌ ను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ పెట్టుబడుల స్వర్గధామం అంటూ పలు దేశాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. వివిధ దేశాల దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు టీ హబ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. వివిధ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వీ హబ్, టీ వర్క్స్, టీఎస్ఐసీ, టాస్క్ సంస్థల లక్ష్యాలు, పనితీరుని దౌత్యవేత్తలు ప్రశంసించారు. ఐటీ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవను వారు అభినందించారు. తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక సెక్రటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, టీ హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్ రావు.. ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

First Published:  20 Aug 2022 1:56 AM GMT
Next Story