Telugu Global
Telangana

ర్యాలీలకు పర్మిషన్‌ ఇవ్వాలని లోకేశ్‌ ఫోన్‌ చేశాడు

ర్యాలీలకు పర్మిషన్‌ ఎందుకు ఇవ్వట్లేదని.. లోకేశ్‌ తనకు ఓ వ్యక్తి ద్వారా ఫోన్ చేసి అడిగాడని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని తనకు చెప్పానన్నారు.

ర్యాలీలకు పర్మిషన్‌ ఇవ్వాలని లోకేశ్‌ ఫోన్‌ చేశాడు
X

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ర్యాలీలు నిర్వ‌హించ‌డంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఏపీ రాజకీయాలతో తెలంగాణకు సంబంధమని ఏంట‌ని, ఇక్కడ ర్యాలీలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాజకీయ అంశమన్నారు. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణలో ఎలాంటి ప్రభావం, పరిణామాలు ఉండవని స్ప‌ష్టం చేశారు. కానీ, ఇక్కడ ఎవరైనా డ్రామాలు చేయడానికి ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. ర్యాలీలకు పర్మిషన్‌ ఎందుకు ఇవ్వట్లేదని.. లోకేశ్‌ తనకు ఓ వ్యక్తి ద్వారా ఫోన్ చేసి అడిగాడని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని తనకు చెప్పానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఐటీ కారిడార్‌లో ర్యాలీలు జరగలేదన్న కేటీఆర్.. ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు

చంద్రబాబు అరెస్టయింది ఏపీలో అని, ర్యాలీలు, ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మొహమాటంగా ఆంధ్రాలో చేసుకోవచ్చన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో ఇవాళ ఈ పార్టీ వాళ్లు ర్యాలీ తీస్తే.. మరుసటి రోజు పోటీగా మ‌రో పార్టీ ర్యాలీ తీస్తే.. ఇక్కడ అధికారంలో ఉన్న తామేం చేయాలంటూ ప్రశ్నించారు కేటీఆర్‌. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా.. సహజంగానే బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ర్యాలీలను అనుమతించమని స్ప‌ష్టం చేశారు. వాళ్ల ఘర్షణకు హైదరాబాద్‌ వేదిక కావాలనడం సరికాదన్నారు.

ఇది పూర్తిగా ఏపీకి చెందిన రెండు రాజకీయ పార్టీల తగాదా అని, ఆ రెండు పార్టీలకు తెలంగాణలో ఉనికే లేదన్నారు మంత్రి కేటీఆర్‌. చంద్రబాబు ఇష్యూ ప్రస్తుతం కోర్టుల్లో ఉందని, ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. తనకు లోకేశ్‌, జగన్‌, పవన్‌కల్యాణ్‌ అందరూ స్నేహితులేనని చెప్పారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఇక్కడకి వచ్చి వాళ్ల మధ్య వైషమ్యాలు సృష్టించడం ఎందుకని ప్రశ్నించారు.

First Published:  26 Sep 2023 11:02 AM GMT
Next Story