Telugu Global
Telangana

ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్.. ఇప్పుడు ఇరిగేషన్.. - కేటీఆర్

ఒకప్పుడు పాలమూరు బిడ్డలు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లేవారని.. ఇప్పుడు కర్నూలు, రాయచూరు నుంచి కూలీలు పాలమూరుకు వస్తున్నారని తెలిపారు.

ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్.. ఇప్పుడు ఇరిగేషన్.. - కేటీఆర్
X

ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్‌.. ఇప్పుడు ఇరిగేషన్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే.. పాలమూరులోనా అని ఒకప్పుడు పాటలు పాడుకునే వారని.. అలాంటి పాలమూరు జిల్లాలో ఇప్పుడు పల్లెపల్లెనా పసిడి పంటలు పండే.. అని పాడుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. ఒకప్పుడు కరువు, కన్నీళ్లు ఉంటే.. ఇప్పుడు చెరువులు, నీళ్లు ఉన్నాయని అన్నారు.




కృష్ణా నదితో పాలమూరుకు జీవం పోసి పంటలు పండుతుంటే.. పాలమూరు పచ్చబడుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు పాలమూరు బిడ్డలు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లేవారని.. ఇప్పుడు కర్నూలు, రాయచూరు నుంచి కూలీలు పాలమూరుకు వస్తున్నారని తెలిపారు.




‘‘ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు అడుగుతున్నారు. కాంగ్రెస్‌కు ఒక్కటి కాదు.. 11 సార్లు దేశ ప్రజలు అవకాశం ఇచ్చారు. 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలి. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు. కేసీఆర్‌ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. అలాగే బీఆర్ఎస్ అంటే.. భారత రైతు సమితి. 10 వేల మందికి కొలువులు ఇచ్చే పరిశ్రమకు దివిటిపల్లిలో శంకుస్థాపన చేశాం.. ఉద్ధంపూర్‌, కరివెన రిజర్వాయర్లలో 30 టీఎంసీల నీరు నింపుతున్నాం. మహబూబ్‌నగర్‌లో 7,900 మందికి రెండు పడకల గదుల ఇళ్లను ఇచ్చాం’’ అని కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి పాలమూరే మచ్చు తునక అన్నారు కేటీఆర్.




First Published:  6 May 2023 11:17 AM GMT
Next Story