Telugu Global
Telangana

నా సీటు పోయినా పర్లేదు.. మహిళా రిజర్వేషన్ ముఖ్యం

మహిళా రిజర్వేషన్ బిల్లుని స్వాగతిస్తున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. మహిళలు చాలామంది రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

నా సీటు పోయినా పర్లేదు.. మహిళా రిజర్వేషన్ ముఖ్యం
X

మహిళా రిజర్వేషన్ బిల్లుని పూర్తిగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. మహిళా నేతలు చాలామంది రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల రిజర్వేషన్లో భాగంగా తన సీటుపోయినా పర్లేదని చెప్పారు. "నా సీటు పోతే పోనివ్వండి. మన జీవితాలు చాలా చిన్నవి, నా పాత్ర నేను పోషించాను." అని కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


మాదాపూర్‌ లో ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని చెప్పారాయన. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని అన్నారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌ గా మారుతుందని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ చాలా అందమైన నగరమని.. ఇక్కడ టాలెంట్‌ కు కొరత లేదన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ నివాస ఖర్చు కూడా చాలా తక్కువేనని తెలిపారు కేటీఆర్.

మహిళలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దాదాపుగా అన్నిపార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. మహిళల రాజకీయ ఉన్నతిని కాంక్షించాయి. బిల్లుకోసం మొదటినుంచీ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూనే ఉంది. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఢిల్లీ స్థాయిలో పోరాటం సాగింది కూడా. ఆ పోరాట ఫలితమే మహిళా బిల్లు అంటూ బీఆర్ఎస్ నేతలు, జాగృతి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, తన సీటు సైతం త్యాగం చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

First Published:  20 Sep 2023 9:57 AM GMT
Next Story