Telugu Global
Telangana

దావోస్ సమ్మిట్ కి కేటీఆర్.. పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన

కేటీఆర్‌ కు స్విట్జర్లాండ్ లో ఘన స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈనెల 15వ తేదీన జురిక్‌ నగరంలో జరిగే మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొంటారని తెలిపారు.

దావోస్ సమ్మిట్ కి కేటీఆర్.. పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన
X

ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌-2023లో పాల్గొనేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నారు. కేటీఆర్‌ కు స్విట్జర్లాండ్ లో ఘన స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు బీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గందె శ్రీధర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15వ తేదీన జురిక్‌ నగరంలో జరిగే మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.

పెట్టుబడులే లక్ష్యంగా..

2018 సంవత్సరంలో మొదటిసారి ఐటీ మినిస్టర్‌ హోదాలో కేటీఆర్‌.. దావోస్‌ పర్యటనకు వెళ్లారు. ప్రపంచంలోని టాప్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న సమ్మిట్‌లో తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ ను మరింత పెంచే విధంగా కేటీఆర్‌ అప్పటి పర్యటన దోహదపడింది. అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రతి ఏటా పెట్టుబడులకోసం కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఈ ఏడాది దావోస్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌ లో కూడా తెలంగాణ జైత్రయాత్ర కొనసాగాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తరలి రావాలని ఆకాంక్షిస్తున్నామని స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ ప్రతినిధులు తెలిపారు. మంత్రి కేటీఆర్‌, ఆయనతోపాటు వచ్చే ఇతర సభ్యులకు స్విట్జర్లాండ్ లోని ప్రవాస భారతీయులు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్ హయాంలో తెలంగాణలో ఐటీ, పరిశ్రమల రంగం కొత్తపుంతలు తొక్కింది. గతంలో పరిశ్రమల అనుమతికోసం కంపెనీలు వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు అనుమతుల విషయంలో త్వరితగతిన పనులు పూర్తవుతున్నాయి. పారిశ్రామిక స్నేహశీల ప్రభుత్వం ఉండటంతో అనుమతులతోపాటు, నిర్వహణ విషయంలో కూడా వ్యాపారవేత్తలకు పలు సానుకూల అంశాలున్నాయి. అందుకే పలు దేశీయ విదేశీ కంపెనీలు తెలంగాణవైపు చూస్తున్నాయి.

గతేడాది అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ 35 సమావేశాల్లో పాల్గొన్నారు. ఎడ్వెంట్‌, స్లేబ్యాక్‌ ఫార్మా, తదితర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొత్తం రూ.7,500 కోట్ల పెట్టుబడులను తీసుకురావడంలో కేటీఆర్‌ సఫలీకృతులయ్యారు. ఆ తర్వాత యూకే పర్యటనలో కూడా పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. దావోస్‌ లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సుకు హాజరైన కేటీఆర్ అక్కడ వివిధ సంస్థలతో మాట్లాడి కేవలం నాలుగు రోజుల్లో రూ.4,200 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోగలిగారు. తాజాగా దావోస్ లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌-2023లో కూడా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందనే అంచనాలున్నాయి.

First Published:  13 Jan 2023 1:54 PM GMT
Next Story