Telugu Global
Telangana

చావు నోట్లో తలపెట్టి.. తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌ - మంత్రి కేటీఆర్‌

ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రాజాసింగ్‌ల‌ను గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీలను పెట్టిందని, వారిని తప్పకుండా ఓడిస్తామని కేటీఆర్‌ తేల్చిచెప్పారు.

చావు నోట్లో తలపెట్టి.. తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌  - మంత్రి కేటీఆర్‌
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చావు నోట్లో తలపెట్టి.. తెలంగాణ తెచ్చిన దమ్మున్న నాయకుడని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబర్‌ 29న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కడివారు అక్కడ దీక్షా దీవస్‌ను పాటించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష అని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రాజాసింగ్‌ల‌ను గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీలను పెట్టిందని, వారిని తప్పకుండా ఓడిస్తామని కేటీఆర్‌ తేల్చిచెప్పారు.

రైతులను ఆదుకునేందుకు కొనసాగిస్తున్న రైతుబంధు పథకంలో భాగంగా సంబంధిత సొమ్మును రైతులకు అందిస్తుంటే.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం రైతుబంధు ఆపేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని కేటీఆర్‌ విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రైతుబంధు కొత్త స్కీమ్‌ కాదని, కొనసాగుతున్న స్కీమ్‌ అని గుర్తుచేశారు. కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని కేటీఆర్‌ తెలిపారు. తమ పార్టీ నేతలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని కేటీఆర్‌ చెప్పారు. పీఎం కిసాన్‌ వేసినప్పుడు రేవంత్‌ ఎందుకు మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌ 3 గంటలు...డీకే శివకుమార్‌ 5 గంటలు కరెంట్‌ అంటున్నారని.. తాము మాత్రం వ్యవసాయానికి 24 గంటలు కరెంట్‌ ఇస్తామని చెబుతున్నామని కేటీఆర్‌ తెలిపారు.


First Published:  26 Nov 2023 9:10 AM GMT
Next Story