Telugu Global
Telangana

జీనోమ్ వ్యాలీ విస్తరణకు భారీ ప్రణాళిక - కేటీఆర్

ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీ ఫేజ్‌-3లో ఉన్నామని, దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. నైపుణ్యం ఉన్న యువత తెలంగాణకు వరం అన్నారు.

జీనోమ్ వ్యాలీ విస్తరణకు భారీ ప్రణాళిక - కేటీఆర్
X

సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోందని తెలిపారు మంత్రి కేటీఆర్‌. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని, హైదరాబాద్‌లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తికి రంగం సిద్ధమవుతోందని.. అంటే ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 50 శాతం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీనోమ్‌ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌ కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు.


ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీ ఫేజ్‌-3లో ఉన్నామని, దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. నైపుణ్యం ఉన్న యువత తెలంగాణకు వరం అన్నారు. వారిని చూసే కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం సహకారం ఆయా కంపెనీలకు వరంగా మారిందని, అందుకే జీనోమ్ వ్యాలీ ఇంతలా విస్తరించిందని వివరించారు. దేశంలోనే అత్యంత సమర్థమైన మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎప్పుడూ పంచాయితీ నడుస్తూనే ఉంటుందని, అయినా కూడా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ లో నెంబర్‌-1 ఎవరని అడిగితే తెలంగాణ అని కేంద్రం కూడా ఒప్పుకుంటుందని చెప్పారు మంత్రి కేటీఆర్. అలాంటి పరిస్థితి మనం కల్పించామన్నారు. తెలంగాణకు ప్రత్యామ్నాయం లేకుండా ఎదగగలిగామని చెప్పారు. దేశ తలసరి ఆదాయం రూ.1,49,000 ఉండగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,000గా ఉందని, అది మన రాష్ట్రం ఘనత అని వివరించారు కేటీఆర్.


First Published:  21 Sep 2023 8:31 AM GMT
Next Story