Telugu Global
Telangana

లక్ష మందికి సీపీఆర్ పై శిక్షణ.. మంత్రి కేటీఆర్

లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పుల వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ వంటి వ్యాధులు వస్తున్నాయి. సీపీఆర్ పై శిక్షణ ఇస్తే కొంతమందిని అయినా కాపాడుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో లక్ష మందికి సీపీఆర్ పై శిక్షణ ఇస్తాం.

లక్ష మందికి సీపీఆర్ పై శిక్షణ.. మంత్రి కేటీఆర్
X

రాజధాని నగరం హైదరాబాద్ లో లక్షమందికి సీపీఆర్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇటీవల కాలంలో యువతకు కూడా గుండెపోటు రావడం చూస్తున్నాం. 30 ఏళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో చనిపోతున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి గుండెపోటుకు గురికాగా తక్షణం స్పందించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధిత వ్యక్తికి సీపీఆర్ చేయడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలోనే సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రశంసిస్తూ నగరంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులకు, ప్ర‌జలకు సీపీఆర్ పై శిక్షణ ఇస్తామని ప్రకటించారు.


కాగా ఇవాళ మేడ్చల్ జిల్లాలో సీపీఆర్ పై శిక్షణను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 'ఇటీవల కాలంలో యువత కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూశా. ఓ పిల్లోడు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

మరో వ్యక్తి జిమ్ లో వ‌ర్క‌వుట్లు చేస్తూ గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఈ రెండు సంఘటనల్లో పక్కన సీపీఆర్ పై శిక్షణ పొందిన వారు ఉంటే వారి ప్రాణాలు దక్కేవి.


లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పుల వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ వంటి వ్యాధులు వస్తున్నాయి. సీపీఆర్ పై శిక్షణ ఇస్తే కొంతమందిని అయినా కాపాడుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో లక్ష మందికి సీపీఆర్ పై శిక్షణ ఇస్తాం. అలాగే జిల్లాల్లో కూడా వందలాదిమందికి శిక్షణ ఇప్పిస్తాం.

ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సీపీఆర్ పై శిక్షణ పొందిన వారిని నియమిస్తాం. ఇక కొత్తగా జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అన్ని వర్గాల విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు కల్పిస్తున్నాం ' అని కేటీఆర్ పేర్కొన్నారు.



First Published:  1 March 2023 12:03 PM GMT
Next Story