Telugu Global
Telangana

దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20శాతం మంది హైదరాబాద్ లోనే..

పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన నగరమని చెప్పారు మంత్రి కేటీఆర్‌. ఐటీ రంగంలో హైదరాబాద్ లక్షలాది ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటిందన్నారు.

దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20శాతం మంది హైదరాబాద్ లోనే..
X

దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20శాతం మంది హైదరాబాద్ లోనే ఉన్నారని, ఇది తెలంగాణకు గర్వకారణం అని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి అద్భుతంగా జరుగుతోందని చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్ లోని థ్రిల్‌ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ (HYSEA) ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్నారు కేటీఆర్.

ఐటీ రంగంలో ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌ ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్‌ ఏర్పాటు చేశామని, ఏ రాష్ట్రంలోనైనా సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు కేటీఆర్.

బెంగళూరుని దాటేశాం..

పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన నగరమని చెప్పారు మంత్రి కేటీఆర్‌. ఐటీ రంగంలో హైదరాబాద్ లక్షలాది ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటిందన్నారు. ఐటీలో గత రెండేళ్లలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. నగరంలో ఉత్తరంవైపు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. తొలిరెండు స్పేస్‌ టెక్‌ స్టార్టప్‌ లు హైదరాబాద్‌ కు చెందినవేనని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు హైదరాబాద్‌ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఈ ఏడాదిలో తెలంగాణలో టీఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందిస్తామని వెల్లడించారు.


కేటీఆరే గర్వకారణం..

ఐటీరంగంలో అభివృద్ధి తెలంగాణకు గర్వకారణం అని, అదే సమయంలో ఐటీ శాఖకు కేటీఆర్ మంత్రిగా ఉండటం ఐటీ ఇండస్ట్రీకి గర్వకారణం అని అన్నారు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ మనీషా. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చేందుతున్నదని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌ చాలా అనుకూలమైన ప్రాంతమని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ఐటీ రంగంలో గత రెండేండ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. కరోనా సమయంలో ఐటీ ఇండస్ట్రీ అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు.

First Published:  9 Jan 2023 10:34 AM GMT
Next Story