Telugu Global
Telangana

కాంగ్రెస్‌ను నమ్ముకుంటే గుండెపోటు గ్యారెంటీ

కర్నాటకలో ప్రజలకు కాంగ్రెస్‌ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. వారి మాటలు నమ్మి ఓటేసిన ప్రజలు అక్కడ నిత్యం నరకం అనుభవిస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌ను నమ్ముకుంటే గుండెపోటు గ్యారెంటీ
X

కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుంటే గుండెపోటు గ్యారెంటీ అని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కర్ణాటక మోడల్‌ అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన హెచ్చరించారు. అక్కడ ఐదు గ్యారంటీలు అమలు చేయలేనివారు.. తెలంగాణలో ఆరు అమలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కర్నాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు ఏ ఒక్క పథకమూ అందడం లేదని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అక్కడ అరచేతిలో వైకుంఠం చూపారు...

కర్నాటకలో ప్రజలకు కాంగ్రెస్‌ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. వారి మాటలు నమ్మి ఓటేసిన ప్రజలు అక్కడ నిత్యం నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. ’శక్తి’ పథకంలో శక్తి లేదని.. గృహలక్ష్మి పథకంలో లక్ష్మి లేదని.. అన్న భాగ్య పథకంలో అన్నం లేదని.. గృహజ్యోతి పథకంలో జ్యోతి లేదని.. ఈ హామీలు ఇచ్చిన రాహుల్‌ గాంధీ రాంరాం చెప్పి వెళ్లిపోయారని మంత్రి తెలిపారు. ప్రియాంక గాంధీ పత్తా లేరని చెప్పారు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటు ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు.

విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు తగ్గిస్తున్నారు...

కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధుల లేమితో విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు తగ్గిస్తోందని మంత్రి చెప్పారు. దీంతో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల భారం తల్లిదండ్రులపై పడుతోందని తెలిపారు. అందుకే తెలంగాణ విద్యార్థులు, యువత ఆలోచించాలని హితవు పలికారు. పాత రోడ్లకు మరమ్మతులు చేయడానికే నిధుల్లేవని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఎమ్మెల్యేలు నిధులు అడగొద్దని అంటున్నారని చెప్పారు. అభివృద్ధి పనులకు నిధులివ్వకపోతే మేమెలా ప్రజల్లోకి వెళ్లాలని 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర సీఎంకు లేఖ రాశారని గుర్తుచేశారు. నియోజకవర్గాలకు వెళ్తే ప్రజలు నిలదీస్తారని తెలిసి వారు బెంగళూరు విడిచి వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చిన ఆరు నెలల్లోపే 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు మార్చేవారు లేక అక్కడి రైతులు అల్లాడుతున్నారన్నారు.

రైతులను ఆదుకుంటున్న నాయకుడు కేసీఆర్‌...

తెలంగాణలో పదేళ్ల కేసీఆర్‌ పాలనలో నేను రైతును అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి వచ్చామని మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. రైతులకే డబ్బులు చెల్లించేలా రైతుబంధు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు వన్‌ ఛాన్స్‌ అని వస్తారని, అధికారంలోకి వచ్చాక ఎక్స్‌క్యూజ్‌మీ ప్లీజ్‌ అంటారని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మళ్లీ కేసీఆర్‌నే గెలిపించుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం బీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు వేసిన అమెరికా.. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మందిని కాల్చి చంపిన డయ్యర్‌ సారీ చెప్పినట్లు ఉందని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా మీ పాపం పోదంటూ మంత్రి ఈ సందర్భంగా విమర్శించారు.

First Published:  17 Nov 2023 9:43 AM GMT
Next Story